Nitin Gadkari: టెస్లా భారత్ లోనే ఎలక్ట్రిక్ వాహనాలు తయారుచేస్తే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు: నితిన్ గడ్కరీ

  • భారత్ లో కార్యాలయం రిజిస్ట్రేషన్ చేసిన టెస్లా
  • ఏడాది గడిచినా భారత్ లో కనిపించని టెస్లా కార్లు
  • స్పందించిన నితిన్ గడ్కరీ
  • విద్యుత్ వాహనాల ధరలు తగ్గుతాయని వెల్లడి
Nitin Gadkari talks about Tesla cars productivity in India

ఎలాన్ మస్క్ సారథ్యంలోని ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజ సంస్థ టెస్లా బెంగళూరులో కార్యాలయాన్ని రిజిస్ట్రేషన్ చేయించి ఏడాది గడుస్తోంది. టెస్లా వాహనాలు ఇప్పటివరకు భారత రోడ్లపై కనిపించలేదు. 

ఈ నేపథ్యంలో కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. టెస్లా భారత్ లోనే ఎలక్ట్రిక్ వాహనాలు తయారుచేస్తే అనేక ప్రయోజనాలు అందుకోవచ్చని చెప్పారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్ అని గడ్కరీ ఉద్ఘాటించారు. పెట్రోల్ ఆధారిత వాహనాలతో పోల్చితే విద్యుత్ ఆధారిత వాహనాల ధరలు తగ్గే రోజు మరెంతో దూరంలో లేదని అన్నారు. ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా చైనా నుంచి ఎలక్ట్రిక్ వాహనాలను దిగుమతి చేసుకుని భారత్ లో విక్రయిస్తుందేమోన్న సందేహాల నేపథ్యంలో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. 

గత నెల 26న కూడా గడ్కరీ ఇదే తరహాలో వ్యాఖ్యానించారు. "ఒకవేళ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ భారత్ లోనే కార్ల ఉత్పాదన జరిపితే ఎలాంటి సమస్యా లేదు. నిరభ్యంతరంగా భారత్ కు రావొచ్చు, కార్ల ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించుకోవచ్చు. ఇక్కడే కార్లు తయారుచేసి విదేశాలకు కూడా ఎగుమతి చేసుకోవచ్చు. అంతేతప్ప చైనా నుంచి మాత్రం ఎలక్ట్రిక్ వాహనాలు దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయించరాదు" అని స్పష్టం చేశారు.

More Telugu News