Anitha: 'జగన్‌ పాలనలో ఊరికో ఉన్మాది' పుస్త‌కాన్ని వాసిరెడ్డి ప‌ద్మ‌కు ఇచ్చిన వంగ‌ల‌పూడి అనిత‌.. వాగ్వివాదం

  • మ‌హిళా క‌మిష‌న్ కార్యాల‌యం వ‌ద్ద టీడీపీ నేతల ఆందోళన  
  • మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ బ‌య‌ట‌కు రావాలని డిమాండ్
  • టీడీపీ మ‌హిళా నేత‌ల‌ను ఆఫీసులోకి అనుమ‌తించిన పోలీసులు
  • టీడీపీ ఇచ్చిన‌ పుస్తకాన్ని పరిశీలించి సమాధానం ఇస్తానన్న‌ వాసిరెడ్డి పద్మ
anita slams ycp

టీడీపీ అధినేత‌ చంద్రబాబు నాయుడితో పాటు బోండా ఉమ‌కు ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ స‌మ‌న్లు పంపి ఈ రోజు విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని పేర్కొన్న విష‌యం తెలిసిందే. దీంతో టీడీపీ నాయకురాలు వంగ‌ల‌పూడి అనిత నేతృత్వంలో తెలుగు మహిళ‌ల ముట్ట‌డితో గుంటూరు జిల్లా, మంగ‌ళ‌గిరిలోని మ‌హిళా క‌మిష‌న్ కార్యాల‌యం వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది.

ఈ క్రమంలో వాసిరెడ్డి ప‌ద్మ‌కు, అనిత‌కు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తమను కార్యాల‌యంలోకి అనుమతించకపోతే మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మనే బ‌య‌ట‌కు రావాలని, మహిళలపై నేరాలకు సంబంధించి వినతిపత్రం అందజేసి వెళ్లిపోతామని తెలుగు మ‌హిళ‌లు చెప్పారు. 

దీంతో కొంద‌రు మహిళలను కార్యాలయంలోకి పోలీసులు అనుమతించారు. వారు వాసిరెడ్డి పద్మకు విన‌తి పత్రం అందజేశారు. విజయవాడ ఆసుప‌త్రిలో సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డ మృగాళ్ల‌తో పాటు అన్ని అత్యాచార ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 

ఈ స‌మ‌యంలోనే మహిళా కమిషన్‌ ఛాంబర్‌లో వాసిరెడ్డి పద్మ, వంగలపూడి అనిత గొడ‌వ‌ప‌డ్డారు. 'సీఎం జగన్‌ పాలనలో ఊరికో ఉన్మాది' అనే పుస్తకాన్ని వాసిరెడ్డి పద్మకు అనిత అందించారు. ఇలాంటి ఆరోప‌ణ‌లు స‌రికాద‌ని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన‌ 800కు పైగా అఘాయిత్యాల్లో ఎందరికి నోటీసులు ఇచ్చారని అనిత‌ ప్రశ్నించారు. దీంతో ఆ పుస్తకాన్ని పరిశీలించి సమాధానం ఇస్తానని వాసిరెడ్డి పద్మ అన్నారు. 

More Telugu News