Narendra Modi: ప్రజాస్వామ్యానికి అవే పునాదులు: ప్రధాని మోదీ

Modi Says Panchayats are Pillars Of Democracy
పల్లెలే దేశ ప్రజాస్వామ్యానికి పునాదులని, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే పిల్లర్లని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో పల్లెలదే కీలక పాత్ర అన్నారు. నవ భారత సౌభాగ్యంలోనే పల్లెలు దృఢత్వం దాగి ఉందన్నారు. 

కాబట్టి ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో భాగంగా పల్లెలను మరింత శక్తిమంతం చేసేలా అందరం ప్రతినబూనాలంటూ ఆయన పిలుపునిచ్చారు. పల్లెల అభివృద్ధిలో ‘స్వామిత్వ’ పథకమే మంత్రమని ప్రధాని అన్నారు. ఆధునిక సాంకేతికతల సాయంతో గ్రామాల్లో అభివృద్ధి, విశ్వాసం పెంపునకు ఆ పథకం ముఖ్యమన్నారు. 

భారత రూపరేఖలను మార్చేసేందుకు, భూ యాజమాన్య హక్కులను డిజిటలైజ్ చేసేందుకు స్వామిత్వ ఓ మంచి అడుగన్నారు. ఈ పథకంతో భూమిని ఆర్థిక ఆస్తిగా ప్రభుత్వం మారుస్తోందని చెప్పారు. పేదల భూములపై వివాదాలను తగ్గించి వారి హక్కులను కాపాడడానికి స్వామిత్వ దోహదం చేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదల జీవితాలను స్వామిత్వ మారుస్తోందని, వారిని ఆత్మనిర్భరులుగా చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. కాగా, 2010 ఏప్రిల్ 24న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తొలి పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ప్రారంభించారు. 

కాగా, ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలోనూ ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రధానుల మ్యూజియం దేశానికే గర్వకారణమన్నారు. మన ప్రధానుల గురించి దేశ ప్రజలకు తెలియజేసేందుకే ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు. దేశ యువతకు వారి జీవిత విశేషాలను ఈ మ్యూజియం మరింత చేరువ చేస్తుందన్నారు. 

మ్యూజియం కోసం ప్రజలు ఎన్నింటినో విరాళంగా ఇస్తున్నారని, దేశ వారసత్వ సంపదలను పెంపొందిస్తున్నారని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో మ్యూజియాలన్నింటినీ డిజిటైజ్ చేసే ప్రక్రియ మరింత వేగం పుంజుకుందన్నారు. యువత అంతా తమతమ స్నేహితులతో కలిసి వచ్చే సెలవుల్లో ప్రధానుల మ్యూజియంను సందర్శించాలని మోదీ విజ్ఞప్తి చేశారు. 

మరోవైపు వేసవి కాలం వచ్చేసిందని, ఎండలు విజృంభిస్తున్నాయని, ఇలాంటి సమయంలో నీటి సంరక్షణకు ఎంతో ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ‘థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ (సంపూర్ణ సిద్ధాంతం)’ గురించి మాట్లాడుతున్నారని తెలిపారు. 

విశ్వంలో ప్రతి దానినీ శాస్త్రవేత్తలు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పటిదాకా మనం ఎన్నింటినో చూసొచ్చినా..కనిపెట్టింది మాత్రం సున్నా అని అన్నారు. వేదాల్లో అప్పట్లోనే వందల కోట్లు, లక్షల కోట్లను లెక్కించారని గుర్తు చేశారు. కాగా, గ్రామాల్లోనూ యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయని, ప్రజలు బయటకు డబ్బు లేకుండానే వెళుతున్నారని చెప్పుకొచ్చారు. 
Narendra Modi
Prime Minister
Panchayatraj Dayh

More Telugu News