Undavalli Arun Kumar: నాడు చంద్రబాబును ప్రశ్నించిన జగన్ ఇప్పుడదే కొనసాగిస్తున్నారు: ఉండవల్లి

  • పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి ఎందుకు అప్పగించరన్న ఉండవల్లి
  • పార్లమెంటులోనూ అడగడంలేదని వ్యాఖ్యలు
  • జగన్ ఏపీలో జూదం ఆడుతున్నారని విమర్శలు
Undavalli comments on Polavaram

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర పరిణామాలపై స్పందించారు. జాతీయ ప్రాజెక్టు పోలవరంను కేంద్రమే నిర్మించి ఇవ్వాలని, చంద్రబాబు ఎందుకు తీసుకున్నారని నాడు విపక్షనేతగా ప్రశ్నించిన సీఎం జగన్... ఇప్పుడెందుకు ఆ ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించడం లేదని ఉండవల్లి ప్రశ్నించారు. నాడు గగ్గోలు పెట్టిన జగన్ ఇప్పుడదే విధానం ఎందుకు కొనసాగిస్తున్నారని నిలదీశారు. 

అటు కేంద్రం కూడా, ఏపీలో ఎలాగూ గెలవం కాబట్టి అక్కడ డబ్బులు ఖర్చు చేయడం ఎందుకని భావిస్తోందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. పోలవరంపై ఏపీ ఎంపీలు ఇప్పటివరకు పార్లమెంటులో ఒక్కసారైనా అడిగారా? అసలు, విభజన చట్టం ఎందుకు అమలు చేయరని కేంద్రాన్ని ఎందుకు అడగడంలేదు? అని ప్రశ్నించారు. 

ఇక, జగన్ ఏపీలో గ్యాంబ్లింగ్ చేస్తున్నారని ఉండవల్లి విమర్శించారు. తాను డబ్బులు ఇస్తున్నాను కాబట్టి ప్రజలు ఓట్లేయాలని ఆయన భావిస్తున్నారని, ఇదో తరహా క్విడ్ ప్రోకో అని వెల్లడించారు. అయితే ఈ పద్ధతిలో ఆయన ఎంతవరకు సఫలం అవుతారో చెప్పలేమని, ఈ విధమైన జూదం ఎవరూ ఆడలేదని వ్యాఖ్యానించారు. అయినా జగన్ ఎంతకాలం డబ్బులు పంచగలడు? నిధులు ఎక్కడ్నించి తీసుకురాగలడు? అంటూ ఉండవల్లి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

More Telugu News