TTD: అందుకే ఆలయం వద్ద తోపులాట చోటు చేసుకుంది.. చ‌ర్య‌లు తీసుకున్నాం: టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి

  • విజిలెన్స్‌, క్షేత్రస్థాయి సిబ్బంది అంచ‌నాలు త‌ప్ప‌డం వ‌ల్లే తోపులాట జరిగిందన్న సుబ్బారెడ్డి 
  • టైమ్‌స్లాట్ టోకెన్ల జారీని పూర్తిగా నిలిపి వేశామ‌ని స్పష్టీకరణ 
  • కంపార్టుమెంటులో ఉంచి స‌ర్వ‌ద‌ర్శ‌నానికి భ‌క్తుల‌ను అనుమ‌తిస్తామ‌న్న టీటీడీ చైర్మన్ 
subba reddy on ttd

తిరుప‌తి ఎస్వీ గోశాల‌లో రూ.3 కోట్ల‌తో నెయ్యి ఉత్ప‌త్తి కేంద్రానికి టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఇటీవ‌ల తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం వ‌ద్ద చోటు చేసుకున్న తోపులాట ఘ‌ట‌న‌పై స్పందించారు. విజిలెన్స్‌, క్షేత్రస్థాయి సిబ్బంది అంచ‌నాలు త‌ప్ప‌డం వ‌ల్లే తోపులాట చోటు చేసుకుంద‌ని వివ‌రించారు. దీంతో ప‌రిస్థితిని స‌మీక్షించి వెంట‌నే చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని అన్నారు. 

టైమ్‌స్లాట్ టోకెన్ల జారీని పూర్తిగా నిలిపివేశామ‌ని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కంపార్టుమెంటులో ఉంచి స‌ర్వ‌ద‌ర్శ‌నానికి శ్రీ‌వారి భ‌క్తుల‌ను అనుమ‌తిస్తామ‌ని వివ‌రించారు. ఈ వేస‌వి కాలంలో శ్రీ‌వారి ఆల‌యం వ‌ద్ద ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటుంద‌ని అంచ‌నా వేశామ‌ని అన్నారు. 

అందుకు త‌గ్గ‌ట్లుగా తాము భ‌క్తుల సౌక‌ర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామ‌ని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కాగా, ఎనిమిది నెల‌ల్లో ఘీ ప్లాంట్ నిర్మాణం పూర్త‌వుతుంద‌ని చెప్పారు. ఈ ప్లాంట్‌ను పూర్తిగా విరాళాల‌తోనే నిర్మిస్తున్నామ‌ని తెలిపారు. ప్ర‌తిరోజు 60 కిలోల నెయ్యి ఉత్ప‌త్తి చేసేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామ‌ని అన్నారు.

More Telugu News