Roja: ​జబర్దస్త్ కు కన్నీటి వీడ్కోలు పలికిన మంత్రి రోజా... వీడియో ఇదిగో!

  • జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా రోజా
  • రోజాకు టూరిజం మంత్రి పదవి
  • ఇకపై సినిమాలు, టీవీ షోలు చేయలేనన్న రోజా
  • భావోద్వేగాలతో జబర్దస్త్ చివరి ఎపిసోడ్
Roja tearful at her last episode in Extra Jabardast

ఆర్కే రోజా... నగరి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గి, తాజాగా మంత్రి పదవి చేపట్టారు. ఇటీవల జరిగిన ఏపీ మంత్రివర్గ కూర్పులో భాగంగా రోజాకు వైసీపీ ప్రభుత్వం టూరిజం శాఖ అప్పగించింది. కాగా, ఇప్పటివరకు రోజా ఈటీవీలో ప్రసారమయ్యే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో న్యాయనిర్ణేతగా కొనసాగారు. అయితే, ఇప్పుడు తాను మంత్రిని కావడంతో బాధ్యతలు పెరిగాయని, ఇకపై సినిమాలు, టీవీ షోలు చేయలేనని ఇటీవలే రోజా ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో, జబర్దస్త్ టీమ్ తమ అభిమాన రోజాకు వీడ్కోలు పలికారు. ఆమె పాల్గొన్న చివరి ఎపిసోడ్ లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రోజా కన్నీటి పర్యంతమైంది. రెండుసార్లు ఎమ్మెల్యే అయినప్పుడు జబర్దస్త్ లోనే ఉన్నానని, ఇప్పుడు మంత్రి అయినప్పుడు కూడా ఇక్కడే ఉన్నానని సంతోషం వ్యక్తం చేశారు. 

తనకు సేవ చేయడం ఎంతో ఇష్టమని, అందుకే జబర్దస్త్ వంటి ఇష్టమైన కార్యక్రమాలను వదులుకోవాల్సి వస్తోందని భావోద్వేగాలతో చెప్పారు. తనకు అవకాశమిచ్చిన ఈటీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. కాగా, రోజా వీడ్కోలు ఎపిసోడ్ లో ఇతర యాంకర్లు, పార్టిసిపెంట్లు కంటతడి పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. త్వరలోనే ఈ స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

More Telugu News