Rahul Gandhi: మేమిచ్చిన ఆఫర్ పట్ల మాయావతి నుంచి కనీస స్పందన లేదు: రాహుల్ గాంధీ

  • ఇటీవల యూపీలో అసెంబ్లీ ఎన్నికలు
  • ఘనవిజయం సాధించిన అధికార బీజేపీ
  • దారుణ ఫలితాలు చవిచూసిన విపక్షాలు
  • మాయావతినే సీఎం అభ్యర్థి ప్రతిపాదన చేశామన్న రాహుల్
  • మాయవతి వెనుకంజ వేశారని వెల్లడి
Rahul Gandhi take a dig at BSP Chief Mayawati

ఇటీవల ముగిసిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అధికార బీజేపీ విజయదుందుభి మోగించగా, విపక్షాలకు మాత్రం తీవ్ర నిరాశ తప్పలేదు. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ ఓటమి ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓ కూటమిగా ఏర్పడదామని బీఎస్పీ అధినేత్రి మాయావతికి సూచించామని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మాయావతే సీఎం అభ్యర్థి అని కూడా స్పష్టత ఇచ్చామని తెలిపారు. 

అయితే తమ ఆఫర్ పట్ల మాయావతి కనీసం ఒక్క ముక్క కూడా మాట్లాడలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. బహుశా కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణల ఒత్తిడి వల్లే ఆమె వెనుకంజ వేసి ఉంటుందని అభిప్రాయపడ్డారు. 

"మీరు సరిగ్గా గమనిస్తే... మాయవతి యూపీ ఎన్నికల్లో ఏమాత్రం పోరాడలేదన్న విషయం స్పష్టమవుతుంది. ఉత్తరప్రదేశ్ లో దళితుల గొంతుక బలంగా వినిపించేందుకు కాన్షీ రామ్ వంటివారు ఎంతగానో కృషి చేశారు. కాంగ్రెస్ కూడా ఓడిపోయింది కదా అంటే అది వేరే విషయం... కానీ మాయవతి తన చర్యల ద్వారా దళితుల కోసం పోరాడేది లేదంటున్నారు" అని రాహుల్ విమర్శించారు. 

'ది దళిత్ ట్రూత్-బ్యాటిల్స్ ఫర్ రియలైజింగ్ అంబేద్కర్స్ విజన్' అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News