New Delhi: తన కంటే చిన్నవాడైన స్నేహితుడిని కిడ్నాప్ చేసి, చంపేసిన 13 ఏళ్ల బాలుడు!

  • ఇద్దరి మధ్య కొన్ని రోజుల క్రితం గొడవ
  • పగ పెంచుకుని ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న నిందితుడు
  • ఆడుకుంటున్న బాలుడిని అడవికి తీసుకెళ్లి చంపేసిన వైనం
13 Year Old Delhi Boy Kidnaps His Friend After Fight and kills

తనకంటే చిన్నవాడైన స్నేహితుడితో గొడవపడిన బాలుడు ఆ తర్వాత అతడిని కిడ్నాప్ చేసి చంపేశాడు. దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణిలో నిన్న జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కొన్ని రోజుల క్రితం బాధితుడైన 8 సంవత్సరాల బాలుడితో నిందితుడైన 13 ఏళ్ల బాలుడు గొడవ పడ్డాడు. ఈ ఘటన తర్వాత స్నేహితుడిపై పగ పెంచుకున్న 13 ఏళ్ల బాలుడు కక్ష తీర్చుకోవాలనుకున్నాడు. 

ఈ క్రమంలో ఇంటి బయట స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న తమ కుమారుడు కనిపించడం లేదంటూ బాధిత బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలుడి కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. చివరికి అతడి స్నేహితుడైన నిందితుడిని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలుడిని అడవిలోకి తీసుకెళ్లిన నిందితుడు అక్కడ అతడిని చంపేసినట్టు తెలిసి పోలీసులు విస్తుపోయారు. 

నిందితుడైన బాలుడిపై కిడ్నాప్, హత్య కేసులు నమోదు చేసిన పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు. రాయితో కొట్టి స్నేహితుడిని చంపేసి, అతడి వద్దనున్న ఫోన్‌ను కూడా తీసుకున్నట్టు విచారణలో బాలుడు తెలిపాడు. అతడిచ్చిన సమాచారంతో బాలుడి మృతదేహం, సెల్‌ఫోన్‌ను సోహాటి గ్రామంలోని అడవి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అబ్జర్వేషన్ హోంకు తరలించారు.

ఈ ఘటనకు గల కారణాలను వివరించిన పోలీసులు.. బాధిత బాలుడి తల్లి కొంతకాలం క్రితం కొంత సొమ్ము, కొన్ని వస్తువులు పోగొట్టుకుంది. అయితే, అవి నిందితుడే తీసినట్టు బాధిత బాలుడు ఆరోపించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన నిందితుడు ఈ పనికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

More Telugu News