Bengalugu: పబ్‌జీ ఆట కోసం రెండు గంటలపాటు రైళ్లను ఆపేసిన 12 ఏళ్ల బాలుడు!

  • బెంగళూరులోని యలహంకలో ఘటన
  • స్నేహితుడితో కలిసి పబ్ జీ 
  • అతడు ఊరెళ్లిపోతే గేమ్ మధ్యలోనే ఆగిపోతుందని భావన
  • రైల్వే స్టేషన్‌కు ఫోన్ చేసి బాంబు పెట్టామని బెదిరింపు
Bengaluru PUBG player makes fake bomb threat call to win game

స్నేహితుడితో కలిసి పబ్ జీ గేమ్ ఆడుతున్న 12 ఏళ్ల బాలుడు ఆట మధ్యలో ఆగిపోకూడదన్న ఉద్దేశంతో పలు రైళ్లను రెండు గంటలపాటు ఆపేశాడు. మార్చి 30న బెంగళూరులోని యలహంక రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. 30న మధ్యాహ్నం రైల్వే పోలీస్ హెల్ప్‌లైన్‌కు ఓ ఫోన్ వచ్చింది. రైల్వే స్టేషన్‌లో బాంబు పెట్టామని, అది ఏ క్షణాన్నైనా పేలొచ్చన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రైళ్లను ఎక్కడికక్కడ ఆపేసి బాంబ్ స్క్వాడ్‌తో కలిసి స్టేషన్‌లో బాంబు కోసం తనిఖీలు చేపట్టారు. చివరికి దానిని ఉత్తుత్తి బెదిరింపుగా గుర్తించారు.


అనంతరం ఫోన్ చేసిన వ్యక్తి గురించి పోలీసులు ఆరా తీయగా అతడు 12 ఏళ్ల బాలుడని తేలింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా విస్తుపోయే విషయం చెప్పాడు. మార్చి 30న తాను స్నేహితుడితో కలిసి పబ్ జీ గేమ్ ఆడుతున్నానని అయితే, తన స్నేహితుడు కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో వేరే ఊరు వెళ్లాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. 

అతడు వెళ్లిపోతే ఆట మధ్యలోనే ఆగిపోతుందని, కాబట్టి ప్రయాణాన్ని ఆపేందుకు బాంబు పెట్టానని ఫోన్ చేశానని బాలుడు చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. అయితే, అతడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేసు పెట్టకుండా హెచ్చరించి వదిలేశారు.

More Telugu News