పబ్బు మీద దాడి కేసు: నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఏసీపీ, సీఐపై ఉన్నతాధికారుల చర్యలు

Telangana Police Take Action Against Police Who Were Raided Pubs
  • పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో తెలంగాణ, ఏపీ మాజీ ఎంపీల కుమారులు
  • మాజీ డీజీపీ కూతురు కూడా ఉన్నట్టు అనుమానం
  • ఏసీపీ సుదర్శన్ కు మెమో జారీ
  • బంజారాహిల్స్ సీఐ సస్పెన్షన్
పబ్ పై దాడి కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పోలీస్ అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఏసీపీ, సర్కిల్ ఇన్ స్పెక్టర్ లపై చర్యలకు పూనుకున్నారు. ఏసీపీ సుదర్శన్ కు చార్జ్ మెమో ఇచ్చిన ఉన్నతాధికారులు.. బంజారాహిల్స్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ శివచంద్రను సస్పెండ్ చేశారు. 

కాగా, నిన్న రాత్రి బంజారాహిల్స్ లోని రాడిసన్ హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ పై పోలీసులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. 144 మందిని అరెస్ట్ చేశారు. అందులో సినీ నటి నిహారిక, సింగర్, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ లూ ఉన్నారు. వాళ్లందరికీ నోటీసులు ఇచ్చి పంపించిన సంగతి తెలిసిందే. ఆ పబ్ నుంచి పోలీసులు డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. 

పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో దాదాపు అందరూ ప్రముఖుల పిల్లలే కావడం, ఇప్పుడు అధికారులపై చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. పబ్ లో మాజీ డీజీపీ కూతురు, ఏపీకి చెందిన మాజీ ఎంపీ కుమారుడు, తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేల కుమారులున్నట్టు తెలుస్తోంది. పబ్ లో లిక్విడ్ రూపంలోనూ డ్రగ్స్ దొరికినట్టు తెలుస్తోంది. అయితే, 12 మందికి మినహా మిగతా అందరికీ పోలీసులు నోటీసులిచ్చి పంపించినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Drugs
Pubs
Police
TS Police
Hyderabad Police
Telangana
Andhra Pradesh

More Telugu News