Lamborghini: భారత్ లో దూసుకుపోతున్న 'లాంబోర్ఘిని'

  • 2007 నుంచి భారత్ లో విక్రయాలు
  • ఇప్పటివరకు 400 కార్ల అమ్మకాలు
  • సంపన్నుల ఫేవెరెట్ కారుగా గుర్తింపు
Lamborghini gears up for sales in India

ఇటలీ ఆటోమొబైల్ బ్రాండ్ లాంబోర్ఘిని భారత్ లో అమ్మకాల పరంగా మెరుగైన ఫలితాలు అందుకుంటోంది. విలాసవంతమైన కార్లకు పెట్టింది పేరు లాంబోర్ఘిని. అనేకమంది సినీ తారలు, ఇతర రంగాల ప్రముఖులు లాంబోర్ఘిని కారును కలిగి ఉండడాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. 

భారత్ లో ఈ బ్రాండు పేరిట 2007 నుంచి కార్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 400 కార్లు అమ్ముడైనట్టు లాంబోర్ఘిని ఇండియా వెల్లడించింది. గతేడాది ఈ సంస్థ 86 శాతం వృద్ధి నమోదు చేసింది. భారత్ లో తమ అమ్మకాలు పెరుగుతుండడం పట్ల లాంబోర్ఘిని హర్షం వ్యక్తం చేసింది. 

లాంబోర్ఘిని కార్లు చూడగానే ఆకట్టుకునే స్పోర్టీ డిజైన్లతో కుర్రకారు మనసును లాగేస్తుంటాయి. లాంబోర్ఘిని పోర్ట్ ఫోలియో చూస్తే... అవెంటడోర్, హురాకాన్, ఉరుస్ మోడళ్లతో పాటు పలు లిమిటెడ్ సిరీస్ ఎడిషన్లను కూడా ఈ అంతర్జాతీయ దిగ్గజం మార్కెట్లోకి తీసుకువచ్చింది. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గతేడాది లాంబోర్ఘిని ఉరుస్ కారును కొనుగోలు చేయడం తెలిసిందే. లాంబోర్ఘిని కార్ల ధరలు కోట్ల రూపాయల్లోనే ఉంటాయి. అందుకే ఇవి సంపన్నుల ఇళ్లలోనే కనిపిస్తుంటాయి.

More Telugu News