Karnataka: ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా ‘నీ కులం ఏంటి?’ అన్న ప్రశ్నే.. ఆటోవాలాగా మారిన ఇంగ్లిష్ లెక్చరర్ కథ!

  • కర్ణాటకలో కులం ఏంటని అడిగేవారు
  • అవకాశాల్లేక ముంబైకి వెళ్లి లెక్చరర్ గా చేశాను
  • రిటైర్ అయ్యాక బెంగళూరులో ఆటో నడుపుతున్నా
  • ఆటో నడిపితేనే ఎక్కువ డబ్బులు వస్తున్నాయన్న 74 ఏళ్ల పట్టాభిరామన్
English Lecturer Turned To Auto Driver

ఆయన వయసు 74 ఏళ్లు. పేరు పట్టాభి రామన్. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అయితే, ఆయనకంటూ ఓ స్పెషల్ ఉంది. అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడడమే ఆ స్పెషాలిటీ. ఆయన మాట తీరు చూసిన నిఖిత అయ్యర్ అనే మహిళా ఉద్యోగి ఆ వివరాలను లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేశారు. 

ఆసక్తికరమైన ఆయన జీవిత విశేషాలను పంచుకున్నారు. దాదాపు 45 నిమిషాల పాటు సాగిన ఆ సంభాషణ తాలూకు వివరాలను ఆమె వెల్లడించారు. 

రిటైర్ అయ్యాక ఏ జాబ్ దొరకలేదని, దీంతో 14 ఏళ్లుగా ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నానని పట్టాభి రామన్ చెప్పారు. కర్ణాటకలో ఉద్యోగ అవకాశాల్లేక ముంబైకి వెళ్లి పోవాయిలోని ఓ ప్రముఖ కాలేజీలో ఇంగ్లిష్ లెక్చరర్ గా చేరానన్నారు. ఎంఏ ఎంఈడీ చేసిన తాను అప్పట్లో బెంగళూరులో ఎక్కడ ఇంటర్వ్యూకు వెళ్లినా ‘నీ కులం ఏంటి?’ అన్న ప్రశ్నే ఎదురైందని, తన పూర్తి పేరు చెప్పగానే అర్థమై ‘తర్వాత చెప్తాం’ అని చెప్పి పంపించేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. 

దీంతో ముంబైకి వెళ్లి 20 ఏళ్ల పాటు ఇంగ్లిష్ లెక్చరర్ గా పనిచేశానని పేర్కొన్నారు. రిటైర్ అయ్యాక బెంగళూరు వచ్చేశానని తెలిపారు. టీచింగ్ చేసేటప్పుడు నెలకు రూ.15 వేలు మాత్రమే ఇచ్చేవారని, కానీ, ఇప్పుడు ఆటో నడుపుతూ రోజుకు రూ.700 నుంచి రూ.1,500 సంపాదిస్తున్నానని పెద్దాయన చెప్పారు. 

తన భార్యే తనకు గర్ల్ ఫ్రెండ్ అని, భార్యలనూ సమానంగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. భర్తకన్నా భార్య ఎప్పుడూ తక్కువ కాదని అన్నారు. కొన్ని కొన్ని సార్లు తనకన్నా తన భార్యే ఎక్కువని అన్నారు. తమకు పిల్లలున్నా వారికి భారం కారాదన్న ఉద్దేశంతోనే తాను ఆటో నడుపుతున్నానని పట్టాభిరామన్ తెలిపారు. ఎవరి జీవితం వాళ్లం గడుపుతున్నామని చెప్పారు.

More Telugu News