డబ్బు కోసం ప్రజలను పీడిస్తున్న జగన్ ప్రభుత్వం: జనసేన
- పిఠాపురంలో మహిళలు లోపలుండగానే ఇంటికి తాళం
- ఘటనపై ఘాటుగా స్పందించిన జనసేన
- ఇది ముమ్మాటికీ క్రిమినల్ చర్యేనన్న నాదెండ్ల
ఖజానాను నింపుకోవడానికి పన్నుల పేరిట ప్రజలను పీడించడంతో పాటుగా వేధిస్తున్నారని జగన్ ప్రభుత్వంపై నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఓటీఎస్ పేరుతో ప్రజల ముక్కుపిండి మరీ వందల కోట్ల మేర నిధులను లాగేశారని ఆయన ఆరోపించారు. పన్నుల కోసం ప్రజల ఇళ్లకు వెళుతున్న అధికారులు.. అక్కడ పన్నుల వసూళ్ల పేరిట సాగిస్తున్న అరాచకాలను నాదెండ్ల ఈ సందర్భంగా ప్రస్తావించారు.
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మునిసిపాలిటీ పరిధిలో పన్నుల కోసం వెళ్లిన అధికారులు.. ఇంట్లో మహిళలు ఉండగానే ఆ ఇంటికి తాళం వేశారని నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య అక్రమ గృహ నిర్బంధం కిందకే వస్తుందన్న ఆయన.. ఇది ముమ్మాటికీ క్రిమినల్ చర్యేనని ఆయన పేర్కొన్నారు. అధికారులు సాగిస్తున్న ఈ తరహా దుశ్చర్యలను ప్రజలు నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ తరహా చర్యలతో సీఎం జగన్ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తున్నారని నాదెండ్ల ఆరోపించారు. ఈ తరహా చర్యలను తమ పార్టీ ఖండిస్తోందని నాదెండ్ల తెలిపారు.