YSRCP: సాక్షిపై కేసు వేసిన టీడీపీ.. మరి ఇప్పుడు మమత బెనర్జీపై కేసు వేస్తుందా?: అంబ‌టి రాంబాబు

  • పెగాస‌స్ టీడీపీ ప్ర‌భుత్వం కొన‌లేదు
  • మ‌మ‌త వ్యాఖ్య‌ల‌తో అంత ఉలికిపాటు ఎందుకు
  • అనైతిక రాజ‌కీయ నేత చంద్ర‌బాబే
  • పెగాస‌స్‌పై త‌క్ష‌ణ‌మే విచార‌ణ జ‌ర‌పాలన్న రాంబాబు  
ysrcp mla ambati rambabu comments on chandrababu

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు మ‌రోమారు తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీ ప్ర‌భుత్వం పెగాస‌స్ స్పై వేర్ టెక్నాల‌జీని కొనుగోలు చేశారంటూ ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెర‌న్జీ ఆరోప‌ణ‌లు చేసిన నేప‌థ్యంలో.. వాటిని ఖండిస్తూ టీడీపీ కూడా వేగంగానే స్పందించింది. అందుకు సాక్ష్యంగా టీడీపీ హ‌యాంలో పెగాస‌స్ టెక్నాల‌జీని కొన‌లేద‌ని ఏపీ మాజీ డీజీపీ గౌతం స‌వాంగ్ ఇచ్చిన ఆధారాన్ని కూడా టీడీపీ బ‌య‌ట‌పెట్టింది.

ఈ నేప‌థ్యంలో టీడీపీ ఉలికిపాటుపై శుక్ర‌వారం తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబుపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ ప్ర‌భుత్వం పెగాస‌స్ టెక్నాల‌జీని కొనుగోలు చేసింద‌ని తామేమీ చెప్ప‌లేద‌ని, అయితే మ‌మ‌తా బెన‌ర్జీ వ్యాఖ్య‌ల‌పై టీడీపీకి అంత ఉలికిపాటు ఎందుక‌ని ఆయన ప్ర‌శ్నించారు. టీడీపీ తీరు గుమ్మడికాయల దొంగలా భుజాలు తడుముకున్న‌ట్లుగా ఉంద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. లోకేశ్ తిండి ఖర్చులకు రూ.30 లక్షలు వాడారని రాస్తే సాక్షిపై కేసు వేసిన టీడీపీ.. మరి ఇప్పుడు మమత బెనర్జీపై కేసు వేస్తుందా? అని ఆయ‌న‌ ప్రశ్నించారు. 

దేశంలోనే టెక్నాలజీకి ఆద్యుడ్ని అని ప్రచారం చేసుకునే చంద్రబాబు.. దేశ సార్వభౌమత్వానికే ముప్పు తెచ్చారని ఆయన ఆరోపించారు. దేశంలో అనైతిక రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే అని విమర్శించారు. చంద్రబాబు జీవితమంతా అనైతిక రాజకీయాలేనని ఆరోపించారు. చంద్రబాబు దుర్మార్గ రాజకీయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. పెగాసస్‌పై విచారణ జరిగితే అసలు విషయాలు బయటకు వస్తాయన్న అంబ‌టి.. త‌క్ష‌ణ‌మే పెగాసస్‌పై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

More Telugu News