IPL: ముంబైలో 'ఢిల్లీ క్యాపిటల్స్' బస్సుపై రాళ్లు, కర్రలతో దాడి.. ఇదిగో వీడియో

  • ఐపీఎల్ కోసం నిన్న ముంబై చేరుకున్న జట్టు 
  • కొలాబాలోని తాజ్ ప్యాలెస్ హోటల్ లో బస
  • హోటల్ ముందు నిలిపిన బస్సును ధ్వంసం చేసిన ఎంఎన్ఎస్ కార్యకర్తలు
MNS Activists Attack Delhi Capitals Bus

ఢిల్లీ క్యాపిటల్స్ బస్సుపై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. నిన్న జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. ఐపీఎల్ టోర్నీ దగ్గరపడుతుండడంతో నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆటగాళ్లు రెండు బస్సుల్లో ముంబైలోని కొలాబాలో ఉన్న తాజ్ ప్యాలెస్ హోటల్ కు చేరుకున్నారు. అయితే, ఆ హోటల్ వద్దకు చేరుకున్న ఎంఎన్ఎస్ కార్యకర్తలు కొందరు హోటల్ ముందు పార్క్ చేసిన ఓ బస్సుకు పోస్టర్లు అంటించి.. రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

దాడి చేసింది ఇందుకేనట...

ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ పై తమకేం కోపం లేదని ఎంఎన్ఎస్ నేత సంజయ్ నాయక్ చెప్పారు. ఐపీఎల్ టోర్నమెంట్ కోసం జట్లు స్థానిక వ్యాపారుల బస్సులను కాకుండా.. బయటి రాష్ట్రాలకు చెందిన వారి బస్సులను అద్దెకు తీసుకుంటున్నాయని, దాని వల్ల స్థానికుల ఉపాధి పోతోందని చెప్పారు. దానిమీద నిరసన తెలిపేందుకే బస్సుపై దాడి చేశామన్నారు. ఆటగాళ్లపైగానీ, జట్టుపైగానీ దాడి చేసే ఉద్దేశం తమకు లేదని తెలిపారు. తాము ఎంతమొత్తుకున్నా వినకుండా బయటి రాష్ట్రాల బస్సులు, ఇతర చిన్న వాహనాలను రాష్ట్రంలోకి అనుమతించారని, మరాఠీల పొట్టగొట్టారని అన్నారు. కాగా, దాడి నేపథ్యంలో హోటల్ వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

More Telugu News