Payal Rajput: తిరుమలలో పాయల్ రాజ్ పుత్ సందడి.. సెల్ఫీల కోసం ఎగబడిన భక్తులు.. ఇదిగో వీడియో

  • శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్
  • చాలా ప్రశాంతంగా ఉందని కామెంట్
  • ఒక్క ఫొటో మేడమ్ అంటూ అనుసరించిన అభిమానులు
Payal Rajput In Tirumala

ఆర్ ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ తిరుమల శ్రీవారి సన్నిధిలో సందడి చేసింది. ఇవాళ ఉదయం ఆమె వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సినిమాల్లో గ్లామరస్ పాత్రల్లో మెరిసిపోయే ఆమె.. తిరుమలకు చాలా సాంప్రదాయబద్ధంగా లంగా ఓణీలో వచ్చింది. దర్శనం అనంతరం బయటకు వచ్చిన ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. 

ఒక్క ఫొటో మేడమ్ అంటూ ఆమెను అనుసరించారు. ఫొటో జర్నలిస్టులు ఆమెను కెమెరాలో బంధించేందుకు ప్రయత్నించారు. అంతటి అభిమానం చూపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. 

వేంకటేశ్వరుడిని దర్శించుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపింది. దైవ దర్శనం అనంతరం చాలా ప్రశాంతంగా అనిపించిందని పేర్కొంది. తిరుమల చాలా అందంగా ఉందని చెప్పింది. ప్రస్తుతం తిరుమలలో ఓ సినిమా షూటింగ్ జరగాల్సి ఉందని తెలిపింది. జిన్నా అనే సినిమాలో నటిస్తున్నానని వెల్లడించింది. కాగా, దాంతో పాటు తీస్మార్ ఖాన్, కిరాతక, గోల్ మాల్, హెడ్ బుష్ వంటి సినిమాల్లో అలరించనుంది. 

మరోవైపు కరోనా తర్వాత ఇప్పుడు తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. నిన్న రెండేళ్ల తర్వాత ఎక్కువ మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 75,775 మంది భక్తులు తిరుమలకు వచ్చారు. 

More Telugu News