Modi son: అతడు మోదీ పుత్రుడు.. ఉక్రెయిన్ నుంచి వచ్చిన ఓ యువకుడి తండ్రి భావోద్వేగం!

  • కుమారుడ్ని చూసి ఉబ్బితబ్బిబ్బయిన శ్రీనగర్ వాసి
  • తిరిగొచ్చిన పిల్లలను చూసి చలించిన తల్లిదండ్రులు
  • మోదీ ఉంటే సాధ్యమేనంటూ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ వద్ద నినాదాలు
He is Modi son not mine says emotional father as son returns from Ukraine

ఉక్రెయిన్ నుంచి వేలాది మంది భారతీయ విద్యార్థులను ఆపరేషన్ గంగ కార్యక్రమం కింద కేంద్ర సర్కారు భారత్ కు తరలించింది. ఇందుకోసం ఏకంగా రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో ప్రధాని మోదీ స్వయంగా మాట్లాడి, భారతీయుల సురక్షిత తరలింపునకు మార్గం కల్పించాలని కోరారు. అలా సుమారు 20వేల మంది వరకు ఉక్రెయిన్ నుంచి రూపాయి ఖర్చు లేకుండా భారత్ కు క్షేమంగా చేరుకున్నారు. 

అటువంటి వారిలో శ్రీనగర్ కు చెందిన ధృవ్ కూడా ఉన్నాడు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంతో తిరిగి తన కుమారుడిని మళ్లీ చూస్తానన్న ఆశలు అతడి తండ్రి సంజయ్ పండితలో ఆవిరయ్యాయి. అటువంటిది కేంద్ర ప్రభుత్వ సహకారంతో క్షేమంగా తిరిగి వచ్చిన కుమారుడ్ని చూసిన సంజయ్ లో ఆనందబాష్పాలు పొంగిపొర్లాయి.

కుమారుడ్ని చూసిన భావోద్వేగంలో.. ‘‘తిరిగొచ్చింది మోదీజీ కుమారుడు. నేను చెప్పాలనుకున్నది ఇదే. అతడు నా కుమారుడు కాదు. సుమీలో నెలకొన్న పరిస్థితుల గురించి తెలుసుకున్న తర్వాత కుమారుడు తిరిగొస్తాడన్న ఆశలు మాలో లేవు. నా కుమారుడిని కాపాడి తీసుకొచ్చినందుకు భారత ప్రభుత్వానికి నా ధన్యవాదాలు’’ అని సంజయ్ పండిత తెలిపారు. 

సుమీ నుంచి 674 మంది భారత విద్యార్థులను ప్రత్యేక బస్సుల్లో సరిహద్దు దేశాలకు తరలించి, అక్కడి నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి మూడు ఫ్లయిట్స్ ద్వారా తీసుకొచ్చారు. దీంతో విమానాశ్రయం వద్ద అప్పటి వరకు వేచి ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలను చూసి భావోద్వేగంతో చలించిపోయారు. హత్తుకుని ఊపిరి తీసుకున్నారు. పిల్లలకు స్వీట్లను పంచిపెట్టి సంతోషం వ్యక్తం చేశారు. ‘‘భారత్ మాతాకీ జై’’, ‘‘మోదీ ఉంటే ఏదైనా సాధ్యమే’’ అన్న నినాదాలు అక్కడ మార్మోగాయి. 

More Telugu News