న్యాయ చిక్కుల్లో సోనాక్షి సిన్హా.. మోసం కేసులో నాన్ బెయిలబుల్ వారంట్

Sonakshi Sinha lands in legal trouble non bailable warrant issued against the actress in a fraud case
  • ఢిల్లీలో ఒక కార్యక్రమానికి వచ్చేందుకు కాంట్రాక్టు
  • అందుకు రూ.37 లక్షలు తీసుకున్న నటి
  • అయినా కార్యక్రమానికి రాని సోనాక్షి
  • దీంతో ఆమెపై మోసం కేసు దాఖలు
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా న్యాయ వివాదంలో చిక్కుకుంది. మోసం కేసులో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ పట్టణం కట్ఘర్ పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే ఈవెంట్ నిర్వాహకుడు ప్రమోద్ శర్మ సోనాక్షి సిన్హాకు వ్యతిరేకంగా కేసు దాఖలు చేశారు. 

ఢిల్లీలో ఒక కార్యక్రమం నిర్వహణకు ప్రణాళిక వేసుకున్న ప్రమోద్ శర్మ దానికి ముఖ్య అతిథిగా సోనాక్షిని ఆహ్వానించాడు. కానీ, ‘దబాంగ్’నటి ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో తాను ఇచ్చిన రూ.37 లక్షలు తనకు తిరిగిచ్చేయాలని ప్రమోద్ శర్మ కోరాడు. కానీ, చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు సోనాక్షి మేనేజర్ తిరస్కరించాడు. సోనాక్షి సిన్హాను స్వయంగా ఎన్నో సార్లు సంప్రదించినా ఫలితం లేకపోవడంతో ప్రమోద్ మోసం కేసు దాఖలు చేశాడు. 

ఈ కేసు విచారణ కోసం సోనాక్షి సిన్హా మొరాదాబాద్ కు రావాల్సి ఉంది. కానీ, ఆమె అదే పనిగా విచారణకు డుమ్మా కొడుతుండడంతో స్థానిక కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
Go Back to Shorts
Sonakshi Sinha
non bailable warrant
fraud case

More Telugu News