BJP: సీబీఐ వద్దా?..అయితే న్యాయ విచార‌ణ‌కైనా ఓకే: జితేంద‌ర్ రెడ్డి

  • నాపై ఇప్పటిదాకా చిన్న మ‌చ్చ కూడా లేదు
  • ఈ వ్య‌వ‌హారంలో స‌మగ్ర ద‌ర్యాప్తు జ‌ర‌గాల్సిందే
  • తెలంగాణ కోసం ఉద్య‌మించిన వారికి ఢిల్లీలో ఆశ్ర‌యమిస్తే త‌ప్పేంటి?
  • మ‌హబూబ్ న‌గ‌ర్ మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి ప్ర‌శ్న‌
exmpjitender reddy demands A comprehensive inquiry should be held into the conspiracy to assassinate Minister Srinivas Gowud

టీఆర్ఎస్‌, బీజేపీల మ‌ధ్య అస‌లే ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోన్న ప్ర‌స్తుత త‌రుణంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హ‌త్య‌కు కుట్ర అంశం ఆ రెండు పార్టీల మ‌ధ్య వైరానికి మ‌రింత ఆజ్యం పోసింద‌నే చెప్పాలి. మంత్రి హ‌త్య‌కు కుట్ర చేసిన వారు పోలీసుల‌కు దొరికిపోగా.. వారిలో మున్నూరు ర‌వి అనే వ్య‌క్తి బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డికి చెందిన ఢిల్లీ నివాసంలో ఆశ్ర‌యం పొందాడని పోలీసులు ప్రకటించారు. 

నిందితుడు ర‌విని పోలీసులు అక్క‌డే అరెస్ట్ చేయ‌డంతో మంత్రి హ‌త్య‌కు జ‌రిగిన కుట్ర‌లో జితేంద‌ర్ రెడ్డితో పాటు బీజేపీకి చెందిన మ‌హిళా నేత డీకే అరుణ‌ల‌ పాత్రపైనా ద‌ర్యాప్తు చేప‌ట్ట‌నున్న‌ట్లుగా సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ స్టీఫెన్ ర‌వీంద్ర బుధ‌వారం వెల్ల‌డించారు. 

ఈ క్ర‌మంలో గురువారం మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్‌లో మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించిన జితేంద‌ర్ రెడ్డి.. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌ర‌గాల్సి ఉంద‌న్నారు. సీబీఐతో ద‌ర్యాప్తు చేయించాల‌ని.. ఒక‌వేళ టీఆర్ఎస్ స‌ర్కారుకు సీబీఐపై న‌మ్మ‌కం లేక‌పోతే న్యాయ విచార‌ణ అయినా జ‌రిపించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. 

ఏళ్ల త‌ర‌బ‌డి రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్న త‌న‌పై ఇప్ప‌టిదాకా చిన్న మ‌చ్చ కూడా లేద‌ని చెప్పిన జితేంద‌ర్ రెడ్డి.. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ నుంచి ఎవ‌రు ఢిల్లీ వ‌చ్చినా తాను ఆశ్ర‌యమిస్తాన‌ని కూడా చెప్పారు. తెలంగాణ కోసం ఉద్య‌మించిన వారికి ఆశ్ర‌యం ఇచ్చి తీరాల్సిందేన‌ని ఆయ‌న చెప్పారు. త‌న ఇంటిలో ఆశ్ర‌యం పొందాడ‌ని చెబుతున్న మున్నూరు ర‌వి ప్ర‌తి వారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌నూ క‌లుస్తుంటాడ‌ని కూడా జితేంద‌ర్ రెడ్డి చెప్పారు.

More Telugu News