Posani Krishna Murali: వాళ్లు ఎలా బతకాలో తెలియని మనుషులు: పోసాని

  • సన్ ఆఫ్ ఇండియా ప్రీరిలీజ్ వేడుకలో పోసాని
  • పరుచూరి బ్రదర్స్ ప్రస్తావన
  • వారి దగ్గర ఐదేళ్లపాటు పనిచేశానని వెల్లడి
  • వారిని ఇండస్ట్రీ దూరం పెట్టిందని ఆవేదన
Posani Krishna Murali attends Son Of India pre release event

మోహన్ బాబు హీరోగా నటించిన సన్ ఆఫ్ ఇండియా చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు పోసాని కృష్ణమురళి మాట్లాడారు. తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరుచూరి బ్రదర్స్ వద్ద ఐదేళ్ల పాటు సహాయకుడిగా పనిచేశానని వెల్లడించారు. అందరూ వాళ్లకు అహంభావం ఎక్కువ అని అంటారని, అందులో వాస్తవంలేదని స్పష్టం చేశారు. వాళ్లు ఎలా బతకాలో తెలియని మనుషులని అన్నారు. చిత్ర పరిశ్రమను చూసిన తర్వాత వాళ్లలా మాత్రం బతకకూడదని నిర్ణయించుకున్నానని పోసాని వివరించారు.

పరుచూరి బ్రదర్స్ రెండు రెండుదశాబ్దాల పాటు కొన్ని వందల చిత్రాలకు పనిచేశారని, అలాంటివాళ్లను చిత్ర పరిశ్రమ దూరంగా పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ గీత రచయిత ఆత్రేయకు కూడా ఒకప్పుడు ఇదే పరిస్థితి ఎదురైందని తెలిపారు.

చిత్రపరిశ్రమలో చావు కూడా ఖరీదైన వ్యవహారంగా ఉండాలని, పేదరికంలో చస్తే పది మంది కూడా రారని, ఉన్నవాడు చస్తే పది వేల మంది వస్తారని అన్నారు. ఈ రెండు చావుల మధ్య ఉండడం ఇష్టంలేక తాను, తన కుటుంబం దూరంగా ఉంటున్నామని తెలిపారు.

పరుచూరి బ్రదర్స్ వద్ద నుంచి వచ్చేసిన తర్వాత నేను నేనుగా బతకాలని ప్రయత్నించా అని వెల్లడించారు. అయితే, సినీ పరిశ్రమ వల్ల రెండు తరాలు కూర్చుని తినగలిగేంత సంపాదించానని పోసాని వెల్లడించారు. సినీ రంగం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు.

More Telugu News