Bandi Sanjay: బీజేపీతో పెట్టుకుంటే మాడిమసైపోతారు.. కేసీఆర్ కోసం ఈ స్కీం తీసుకొస్తాం: బండి సంజయ్

Will bring this scheme for KCR says Bandi Sanjay
ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక చెల్లని రూపాయి అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ని ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. బీజేపీతో పెట్టుకుంటే కేసీఆర్ మాడిమసైపోతారని చెప్పారు. బీజేపీని ఆయన ఏమీ చేయలేరని అన్నారు. జనగామలో సభ పెట్టడానికి రెండు రోజుల ముందే బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారని... కేసీఆర్ ముఖంలో భయం కనపడుతోందని చెప్పారు. లాఠీ దెబ్బలు తిన్నా తమ కార్యకర్తలు భయపడలేదని అన్నారు.

నిన్నటి మీటింగ్ లో కేసీఆర్ సోయి లేకుండా మాట్లాడారని బండి సంజయ్ అన్నారు. సీఎం సభ అంటే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పాలని, చేయబోయే అభివృద్ధి గురించి చెప్పాలని... కానీ కేసీఆర్ మాత్రం తన ప్రసంగం మొత్తం బీజేపీ నాయకులను టార్గెట్ చేసి విమర్శించారని మండిపడ్డారు. కేసీఆర్ మాటలను ప్రజలెవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. నిన్నటి మీటింగులో మోదీ గురించి కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

రాజ్యాంగాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ క్షమాపణ చెపుతారని ఆశించామని... కానీ, రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామని చెప్పడానికే ఆయన సభలు పెడుతున్నారని సంజయ్ విమర్శించారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా? అంబేద్కర్ రాజ్యాంగం కావాలా? అనేది ప్రజలు తేల్చుకోవాలని అన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు.

పొలాల దగ్గర మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు చెప్పిందో సమాధానం ఇవ్వాలని సంజయ్ డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించినా... తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బహిరంగసభల వద్ద కూడా డ్రంకెన్ డ్రైవ్ టెస్టు నిర్వహిస్తామని... కేసీఆర్ కోసం ఈ స్కీమ్ తప్పకుండా తీసుకొస్తామని అన్నారు.
Bandi Sanjay
BJP
KCR
TRS

More Telugu News