Pakistan: హిజాబ్ వివాదాన్ని అడ్డుపెట్టుకుని ఉర్దూయిస్థాన్ ఏర్పాటుకు కుట్ర!: నిఘా వర్గాల హెచ్చరిక

  • సిఖ్స్ ఫర్ జస్టిస్ తో చేతులు కలపొచ్చు
  • ఉర్దూయిస్థాన్ ఏర్పాటుకు ప్రయత్నించొచ్చు
  • పోలీసులకు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరిక
Pakistans ISI trying to fuel hijab row through Khalistani outfit SFJ

పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ భారత్ లో అశాంతి రాజేసేందుకు రంగంలోకి దిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న హిజాబ్ వివాదాన్ని ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ (ఎస్ఎఫ్జే) సాయంతో మరింత రగిలించే ప్రయత్నం చేస్తున్నట్టు నిఘా వర్గాలు (ఇంటెలిజెన్స్) హెచ్చరించాయి.

ముస్లిం విద్యార్థినులు ముఖానికి వస్త్రం ధరించి (హిజాబ్) విద్యా సంస్థలకు రావడం కుదరదంటూ కర్ణాటక రాష్ట్రం అభ్యంతరం చెప్పడం ఈ వివాదానికి నేపథ్యంగా ఉంది. విద్యాలయాలు మత విశ్వాసాలు, ఆచారాలకు వేదిక కాకూడదని కర్ణాటక సర్కారు వాదన. ఇది క్రమంగా ఒక్కో రాష్ట్రానికి విస్తరిస్తోంది. దీనిపై కర్ణాటక హైకోర్టు విచారణ కూడా నిర్వహిస్తోంది.

భారత్ వ్యతిరేక శక్తులు కొన్ని సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపట్వనర్ సింగ్ పన్నుతో చేతులు కలపొచ్చని, హిజాబ్ అంశాన్ని అడ్డుపెట్టుకుని ఉర్దూయిస్థాన్ కాన్సెప్ట్ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయవచ్చంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలను తాజాగా హెచ్చరించింది.

రాజస్థాన్, ఢిల్లీ, యూపీ, బిహార్, వెస్ట్ బెంగాల్ లోని ప్రాంతాలతో ఉర్దూయిస్థాన్ ఏర్పాటుకు హిజాబ్ రెఫరెండమ్ ఉద్యమాన్ని ముస్లింలు ప్రారంభించాలంటూ సిఖ్స్ ఫర్ జస్టిస్ పిలుపునిచ్చినట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో పేర్కొంది. ఇందుకు కావాల్సిన నిధులను సమీకరిస్తామంటూ హామీఇవ్వడాన్ని ప్రస్తావించింది.

More Telugu News