Tremors: ఉత్తరాది ప్రాంతాల్లో భూ ప్రకంపనలు.. ట్విట్టర్ లో పలువురి స్పందనలు

  • ఆఫ్ఘనిస్థాన్ - తజకిస్థాన్ సరిహద్దుల్లో భూకంప కేంద్రం
  • రిక్టర్ స్కేలుపై 5.7 మాగ్నిట్యూడ్
  • ప్రకటించిన జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం
Strong Tremors Felt In Delhi Noida Jammu kashmir

ఆఫ్ఘనిస్థాన్ - తజకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో భూపంకం సంభవించింది. 5.7 మాగ్నిట్యూడ్ తీవ్రతతో వచ్చిన ఈ భూకంప ప్రభావం మన దేశంలోని ఉత్తరాది ప్రాంతాల్లోనూ కనిపించింది.

ఢిల్లీ, యూపీ, జమ్మూ కశ్మీర్ తదితర రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు తలెత్తాయి. భూమి 20 సెకన్ల పాటు కంపించినట్టు గుర్తించామని నోయిడాకు చెందిన కొందరు ట్వీట్ ద్వారా ఇతరులతో సమాచారాన్ని పంచుకున్నారు. భూమి కంపించడాన్ని తాము సైతం గుర్తించినట్టు ఢిల్లీ వాసులు కూడా ట్విట్టర్ పై స్పందించారు.

‘‘తల తిరుగుతున్నట్టు అనిపించింది. దీంతో కళ్లుమూసి తెరిచి ఫ్యాన్ వైపు చూశా. అప్పుడు అర్థమయ్యింది భూకంపం అని’’ అంటూ ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు.

మరోవైపు జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం కూడా దీనిని ధ్రువీకరించింది. శనివారం ఉదయం 9.45.59కి ఆఫ్ఘనిస్థాన్ -  తజకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో వచ్చినట్టు తెలిపింది. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత చూపించినట్టు పేర్కొంది. భూమికి 181 కిలోమీటర్ల లోతులో కేంద్రం ఉన్నట్టు తెలిపింది.

More Telugu News