rcb: ఆర్సీబీ కెప్టెన్ రేసులో శ్రేయాస్ అయ్యర్?

  • ఆసక్తిగా ఉన్న జట్టు యాజమాన్యం
  • రెండు కొత్త జట్లకు ఎంపిక అవకాశం
  • అవి తీసుకోకపోతే వేలంలోకి అయ్యర్
  • అప్పుడు పెరగనున్న డిమాండ్
rcb keen to take sreyas ayyar as a captain

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మాజీ సారథి శ్రేయాస్ అయ్యర్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ గా వెళ్లనున్నాడా..? ఇందులో నిజమెంతో వెల్లడి కానప్పటికీ, ప్రచారం మాత్రం జరుగుతోంది. శ్రేయాస్ కు గాయం కారణంగా గత ఐపీఎల్ సీజన్ లో రిషబ్ పంత్ కు కెప్టెన్ గా ఢిల్లీ క్యాపిటల్స్ అవకాశం ఇచ్చింది. బాగా రాణించడంతో అతడ్నే జట్టు కెప్టెన్ గా రిటైన్ చేసుకుంది. దాంతో కెప్టెన్ పదవి అయ్యర్ కు దూరమైంది. దీంతో శ్రేయాస్ అయ్యర్ వేరుబాట పట్టాడు.

ఇక ఐపీఎల్ 2022 సీజన్ కు రెండు కొత్త జట్లు అహ్మదాబాద్, లక్నో వచ్చి చేరనున్నాయి. వీటిల్లో అహ్మదాబాద్ జట్టు శ్రేయార్ అయ్యర్ ను కెప్టెన్ కోసం సంప్రదించిందని, అతడ్ని తీసుకోవడం ఖాయమంటూ తొలుత వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ, అహ్మదాబాద్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్న సీవీసీ క్యాపిటల్స్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది.

దీంతో శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టులో భాగం కానున్నాడనే దానిపై ఆసక్తి మరింత పెరిగింది. మరో కొత్త జట్టు లక్నో కేఎల్ రాహుల్ ను కెప్టెన్ గా తీసుకుంటుందన్న ప్రచారం నడుస్తోంది. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) శ్రేయాస్ అయ్యర్ పై కన్నేసినట్టు తెలిసింది. అహ్మదాబాద్, లక్నో జట్లు వేలానికి ముందే ముగ్గురేసి ఆటగాళ్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఈ రెండు జట్లు శ్రేయాస్ అయ్యర్ తో డీల్ చేసుకోకపోతే.. అప్పుడు అయ్యర్ వేలంలోకి వస్తాడు.

వేలంలో ఎంత ధర పలికినా అయ్యర్ ను సొంతం చేసుకోవాలన్న నిర్ణయానికి ఆర్సీబీ యాజమాన్యం వచ్చిందని తాజా సమాచారం. విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2021 తర్వాత ఆర్సీబీ కెప్టెన్ గా కొనసాగబోనని ప్రకటించడం తెలిసిందే. దీంతో కొత్త కెప్టెన్ కోసం జట్టు అప్పటి నుంచే అన్వేషణలో ఉంది. ఐపీఎల్ 2022 సీజన్ కు ముందుగా వచ్చే నెలలో బెంగళూరులో ఆటగాళ్ల మెగా వేలం జరగనుంది.

More Telugu News