Sadanandan: కోడిమాంసం కొనడానికి వెళ్లి కోటీశ్వరుడయ్యాడు!

  • కేరళలోని కుడయంపడి ప్రాంతంలో ఘటన
  • పెయింటర్ గా పనిచేస్తున్న సదానందన్
  • ఆదివారం మార్కెట్ కు వెళ్లిన వైనం
  • రూ.500కి చిల్లర కోసం లాటరీ టికెట్ కొనుగోలు
  • అదే టికెట్ కు రూ.12 కోట్ల బంపర్ ప్రైజ్
Kerala man wins bumper lottery

కేరళలో ఓ సాధారణ పెయింటర్ ను అదృష్ట లక్ష్మి వరించింది. చిల్లర కోసం లాటరీ టికెట్ కొన్న వ్యక్తి కోటీశ్వరుడయ్యాడు. కొట్టాయంకు సమీపంలోని కుడయంపడి ప్రాంతంలో నివసించే సదానందన్ ఓ పెయింటింగ్ కార్మికుడు. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితం! ఇటీవల క్రిస్మస్-కొత్త సంవత్సరం సీజన్ ను పురస్కరించుకుని బంపర్ లాటరీ ప్రకటించారు.

కాగా, సదానందన్ ఆదివారం చికెన్ తీసుకువచ్చేందుకు మార్కెట్ కు వెళ్లాడు. అయితే అతడి వద్ద రూ.500 నోటు ఉండడంతో చికెన్ దుకాణదారు చిల్లర ఇస్తాడో లేడో అని సందేహించి, సమీపంలో ఉన్న లాటరీ టికెట్ల దుకాణం వద్దకు వెళ్లాడు. అక్కడ ఓ లాటరీ టికెట్ కొని రూ.500కి చిల్లర తీసుకున్నాడు. ఆపై చికెన్ కొనుక్కుని ఇంటికి వచ్చాడు. ఇప్పుడా లాటరీ టికెట్ కు రూ.12 కోట్ల బంపర్ ప్రైజు తగిలింది. కుడయంపడిలో ఇప్పుడు సదానందన్ పేరు మార్మోగిపోతోంది.

లాటరీ డబ్బుతో ఏంచేస్తావని సదానందన్ ను ప్రశ్నించగా, సరైన ఇల్లు కట్టుకుంటామని, మిగతా డబ్బును కొడుకులు, వారి కుటుంబాలు ఆనందంగా ఉండేందుకు వెచ్చిస్తానని వెల్లడించాడు. కేవలం చిల్లర కోసం వెళ్లడం వల్లే సదానందన్ జీవితం ఈ మలుపు తిరిగింది. అదృష్టం ఇలా కలిసివచ్చింది.

More Telugu News