richest persons: కరోనా దెబ్బకు పేదరికంలోకి 16 కోట్ల మంది.. సంపన్నుల ఐశ్వర్యం మాత్రం రెట్టింపు!

  • ఆక్స్ ఫామ్ సంస్థ నివేదిక విడుదల
  • పెరిగిన పేద, ధనిక అసమానతలు
  • నిత్యం 21000 మంది మరణం
  • కుబేరుల సంపద గత రెండేళ్లో భారీ వృద్ధి
Worlds 10 Richest Men Wealth Doubled during corona period

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకోవడమే కాదు.. పేద, ధనిక మధ్య మరింత అంతరాన్ని పెంచింది. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు కరోనా చికిత్సతో ప్రాణాలు దక్కించుకున్నా.. ఆ వైద్య ఖర్చుకు ఆర్థికంగా కుదేలైన వారు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు. ఆక్స్ ఫామ్ తాజా గణాంకాలను చూస్తే కరోనా చేసిన నష్టం కళ్లకు కడుతుంది.

మహమ్మారి కోరలు చాచిన 2020, 2021 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా 10 మంది ఐశ్వర్యవంతుల సంపద రెట్టింపైనట్టు ఆక్స్ ఫామ్ సంస్థ ప్రకటించింది. 700 బిలియన్ డాలర్ల నుంచి 1.5 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. పేదరికం, అసమానతలు పెరిగినట్టు తెలిపింది. అంతకుముందు 14 ఏళ్లలో పెరిగిన దానితో పోలిస్తే కరోనా కాలంలోనే బిలియనీర్ల సంపద మరింత వృద్ధి చెందినట్టు గణాంకాలను విడుదల చేసింది.

అసమానతలు ఎంతలా విస్తరించాయంటే.. ఆరోగ్య సదుపాయాల్లేక, ఉన్నా అందుకునే పొందే స్తోమత లేక నిత్యం 21,000 మంది ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు విడుస్తున్నారు. కరోనా దెబ్బకు 16 కోట్ల మంది పేదరికంలోకి వెళ్లిపోయారు.  

టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్జీ బ్రిన్, ఫేస్ బుక్ చీఫ్ జుకర్ బర్గ్, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవోలు బిల్ గేట్స్, స్టీవ్ బాల్మర్, ఒరాకిల్ సీఈవో లారీ ఎల్లిసన్, సుప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్, ఎల్ వీఎంహెచ్ చీఫ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ టాప్ 10 ప్రపంచ సంపన్నులుగా ఆక్స్ ఫామ్ నివేదిక పేర్కొంది.

More Telugu News