Team India: సెంచురియన్ టెస్టులో ముగిసిన తొలి రోజు ఆట... టీమిండియా స్కోరు 272-3

  • టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు
  • సెంచురియన్ లో నేడు ప్రారంభం
  • సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్
  • మయాంక్ అర్ధసెంచరీ
  • పుజారా డకౌట్ 
  • 3 వికెట్లు పడగొట్టిన ఎంగిడి
First day of Centurion test concludes

టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య సెంచురియన్ లో నేడు ప్రారంభమైన మొదటి టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్లకు 272 పరుగులు చేసింది. సెంచరీ హీరో కేఎల్ రాహుల్ 122 పరుగులతోనూ, అజింక్యా రహానే 40 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. 248 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 16 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో పేసర్ లుంగీ ఎంగిడి 3 వికెట్లు తీశాడు. ఎంగిడి తప్ప మిగతా సఫారీ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. స్టార్ బౌలర్ కగిసో రబాడా తొలి రోజు ఆటలో ఒక్క వికెట్టు కూడా తీయలేకపోయాడు. మొత్తమ్మీద భారత్ దే పైచేయిగా నిలిచింది.

టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ (60) తొలి వికెట్ కు 117 పరుగులు జోడించి మెరుగైన ఆరంభం అందించగా, కెప్టెన్ కోహ్లీ 35 పరుగులు చేసి మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఇటీవల తరచుగా విఫలమవుతున్న ఛటేశ్వర్ పుజారా డకౌట్ అయ్యాడు. పుజారాతో పాటు విమర్శలు ఎదుర్కొంటున్న రహానే మాత్రం ఇవాళ్టి ఆటలో చక్కగా రాణించాడు. 81 బంతులు ఎదుర్కొన్న రహానే 8 ఫోర్ల సాయంతో 40 పరుగులు చేశాడు.

ఇక రెండో రోజు ఆటలో కేఎల్ రాహుల్, రహానే జోడీ ఎంత సేపు క్రీజులో ఉంటుందన్న దానిపై భారత్ భారీ స్కోరు ఆశలు ఆధారపడి ఉన్నాయి.

More Telugu News