Army: సీడీఎస్ మరణంతో మళ్లీ పాత పద్ధతే.. చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్​ ఎన్నిక!

  • ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే నియామకం
  • సీనియారిటీ పరంగా ఆయనకే బాధ్యతలు
  • తదుపరి సీడీఎస్ ను నియమించే వరకు ఇదే అమలు
Naravane Takes Charge As Chairman Of The Chiefs Of Staff Committee

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) మరణంతో ఆ పోస్టు ఇప్పుడు ఖాళీ అయింది. ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవాణేకి ఆ పదవి ఇస్తారని ఊహాగానాలు వినిపించినా ప్రస్తుతానికి అదేం లేదని తేలిపోయింది. తదుపరి సీడీఎస్ ను నియమించే వరకు ఆర్మీలో సీడీఎస్ నియామకానికి ముందున్న సిస్టమ్ నే అనుసరించాలని నిర్ణయించారు.

సీడీఎస్ నియామకానికి ముందు త్రివిధ దళాలను సమన్వయం చేసుకునేందుకు ‘ద చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ’ అనేది ఉంటుండేది. ఇప్పుడు ఆ పాత పద్ధతినే కొన్నాళ్ల పాటు కొనసాగించనున్నారు. మంగళవారం ఈ కమిటీ సమావేశమైంది. ముగ్గురు చీఫ్ లలో సీనియర్ అయిన నరవాణేని కమిటీకి చైర్మన్ ను చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు ఆయన నిన్న బాధ్యతలు చేపట్టారు. వాస్తవానికి భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్. భదౌరియా, నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్. హరి కుమార్ లూ ఉన్నా.. వారిద్దరూ ఇటీవలే పదవులను స్వీకరించారు. ఈ నేపథ్యంలోనే వారి కన్నా సీనియర్ అయిన నరవాణేని సీవోఎస్ సీకి చైర్మన్ గా నియమించారు.  

డిసెంబర్ 8న తమిళనాడులోని కూనూరులో హెలికాప్టర్ కూలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా 14 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి శాశ్వత చైర్మన్ గా ఉండడంతో పాటు మిలటరీ వ్యవహారాలనూ సీడీఎస్ చూస్తారు.

More Telugu News