Sangareddy District: మరో గంటలో పెళ్లి.. రూ. 25 లక్షలు, 25 తులాల బంగారంతో ఉడాయించిన వరుడు!

  • సంగారెడ్డి జిల్లాలో ఘటన
  • ఈ నెల 12న వివాహానికి ఏర్పాట్లు
  • వరుడితోపాటు కుటుంబ సభ్యులు కూడా
  • ఆగిపోయిన పెళ్లి
  • జిల్లా న్యాయసేవాధికార సంస్థలో వధువు ఫిర్యాదు
Bridegroom elope with money and gold

మరో గంటలో పెళ్లి కావాల్సి ఉండగా కట్నం డబ్బులు, బంగారం పట్టుకుని ఉడాయించాడో వరుడు. సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్నాపూర్ గ్రామంలో జరిగిందీ ఘటన. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యువతిని కొండాపూర్ మండలం మల్కాపూర్‌కు చెందిన మాణిక్‌రెడ్డికి ఇచ్చి వివాహం జరిపించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆగస్టులో నిశ్చితార్థం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా వరుడికి రూ. 25 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని కట్నంగా ఇచ్చారు.

ఈ నెల 12న వీరి వివాహం జరగాల్సి ఉండగా, సంగారెడ్డిలోని పోతిరెడ్డి‌పల్లిలో కల్యాణ మండపం ఏర్పాటు చేశారు. సరిగ్గా మరో గంటలో వివాహం జరుగుతుందనగా కట్నంగా ఇచ్చిన రూ. 25 లక్షల నగదు, 25 తులాల బంగారం పట్టుకుని వరుడు ఊరి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు కూడా ఊరు విడిచారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, బాధిత వధువు నిన్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలోనూ వరుడు, అతడి కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసింది.

More Telugu News