Gujarat: మొత్తానికి చిక్కిన చెడ్డీగ్యాంగ్.. గుజరాత్‌లో ఏపీ పోలీసులకు పట్టుబడిన ముఠా సభ్యులు!

  • గత నెలలో గుజరాత్ నుంచి విజయవాడ వచ్చిన ముఠా
  • పోరంకి, వసంత్‌నగర్‌లో చోరీలు
  • అక్కడి నుంచి గుజరాత్‌లోని దాహోద్‌కు ఫోన్ కాల్స్
  • ఒక్కో ముఠాలో ఐదుగురు చొప్పున రెండు ముఠాలు ఉన్నట్టు అనుమానం
  • ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు?
at last police arrested cheddi gang in gujrat

విజయవాడ, గుంటూరులో యథేచ్ఛగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన చెడ్డీ గ్యాంగ్ సభ్యుల్లో కొందరు ఎట్టకేలకు పోలీసులకు చిక్కినట్టు తెలుస్తోంది. ఈ గ్యాంగ్‌కు చెందిన ముగ్గురిని గుజరాత్‌లోని దాహోద్‌లో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మిగిలిన వారి ఆచూకీ కోసం వారిని ప్రశ్నిస్తున్నారు. చెడ్డీగ్యాంగ్‌లో ఒక్కో దాంట్లో ఐదుగురు చొప్పున రెండు ముఠాలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ముఠా ఈ నెల 7న పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పోరంకి, వసంత్‌నగర్‌లో చోరీలకు పాల్పడింది. ఆ తర్వాత ముఠా కదలికలు ఆగిపోయాయి. నిఘా పెరగడంతో ముఠా గుజరాత్ చెక్కేసినట్టు అనుమానించిన పోలీసులు రెండు బృందాలను ఆ రాష్ట్రానికి పంపారు. చెడ్డీగ్యాంగ్ సభ్యులు ఉపయోగించిన ఫోన్ల ఆధారంగా వీరి ఆచూకీని కనిపెట్టారు.

గత నెలలో రైలులో గుజరాత్ నుంచి వచ్చిన ముఠా విజయవాడలో దిగింది. అనంతరం ఓ రోజు మొత్తం వివిధ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి ఇళ్లను ఎంపిక చేసుకుంది. అనంతరం చిట్టినగర్, గుంటుపల్లి, పోరంకిలో చోరీలకు పాల్పడింది.

పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా ఆ ప్రాంతం నుంచి వెళ్లిన ఫోన్ కాల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ ప్రాంతం నుంచి గుజరాత్‌లోని  దాహోద్ ప్రాంతానికి కొన్ని ఇన్‌కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ వెళ్లినట్టు గుర్తించారు. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసు బృందాలు వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే,  ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించాల్సి ఉంది.

More Telugu News