Karnataka: 65 ఏళ్ల వయసులో పెళ్లాడి ప్రేమను పరిపూర్ణం చేసుకున్న జంట

  • కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో ఘటన
  • సమాజ కట్టుబాట్లను పక్కన పెట్టి 65 ఏళ్ల వయసులో పెళ్లి
  • సామాజిక మాధ్యమాల్లో పెళ్లి ఫొటోలు చక్కర్లు
65 year old love couple reunite after married

గాఢంగా ప్రేమించిన అమ్మాయికి అనుకోని పరిస్థితుల్లో వేరొకరితో వివాహమైంది. అతడు మాత్రం ఆమె జ్ఞాపకాలనే నెమరువేసుకుంటూ బతికేశాడు. ప్రస్తుతం అతడి వయసు 65 సంవత్సరాలు. మరోవైపు, పెద్దల బలవంతంతో మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆమె కొంతకాలానికి భర్తను కోల్పోయింది. పిల్లలు కలగలేదు. దీంతో ఒంటరిగానే జీవితాన్ని గడిపింది. అయినప్పటికీ వారిలో ప్రేమ అలాగే మిగిలి ఉంది. ఇద్దరూ తాము ప్రేమించుకున్న నాటి మధురానుభూతులను నెమరువేసుకుంటూ గడిపేశారు. చివరికి ఈ వయసులో ఒక్కటై తమ ప్రేమను నిలబెట్టుకోవాలని భావించారు. అనుకున్నదే తడవుగా సమాజ కట్టుబాట్లను చీల్చుకుని 65 ఏళ్ల వయసులో శాస్త్రోక్తంగా పెళ్లాడి ఒక్కటయ్యారు.

కర్ణాటకలోని మాండ్య జిల్లా మేలుకోటెలో జరిగిందీ ఘటన. మైసూరులోని హెబ్బాళ ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల చిక్కణ్ణ, అదే ప్రాంతానికి చెందిన జయమ్మ (65) మేలుకోటె చెలువనారాయణస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆశ్రమంలో శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నారు. లేటు వయసులో ఘాటు ప్రేమను పండించుకున్న ఈ దంపతుల ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ తిరుగుతున్నాయి.

More Telugu News