Stephen Ravindra: సైబర్ క్రైమ్.. ఏడాది కాలంలో కోట్ల రూపాయలను కాజేశారు: స్టీఫెన్ రవీంద్ర 

  • దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసం గుట్టు రట్టు చేశాం
  • స్ఫూఫింగ్ యాప్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు
  • దేశ వ్యాప్తంగా వీరిపై 209 కేసులు నమోదయ్యాయి
Busted big cyber crime says Stephen Ravindra

మన దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసం గుట్టు రట్టు చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. లోన్ బజార్, ద లోన్ ఇండియా, ఎస్బీఐ ధనీ బజార్ పేర్లతో నకిలీ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి వందల కోట్ల మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక స్ఫూఫింగ్ యాప్ ద్వారా ఎస్బీఐ అసలైన కస్టమర్ కేర్ నుంచే ఫోన్ వస్తున్నట్టు నమ్మిస్తూ జనాలను వీరు మోసం చేస్తున్నారు.

ఈ సందర్భంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ... ఈ కాల్ సెంటర్ నుంచి ఏడాది కాలంలో 33 వేల కాల్స్ చేశారని... కోట్ల రూపాయలను కాజేశారని చెప్పారు. ఎస్బీఐ ఏజెంట్ల నుంచి కస్టమర్ల వివరాలు తీసుకుని క్రెడిట్ కార్డు ఉన్నవారి నుంచి డబ్బులు కాజేస్తున్నారని తెలిపారు. ఈ యాప్ వాడకంలో ఫర్మాన్ హుస్సేన్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించారని చెప్పారు. 18601801290 అనే నంబర్ నుంచి స్ఫూఫింగ్ చేస్తున్నట్టు తెలిపారు.
 
ఈ ముఠాపై దేశ వ్యాప్తంగా 209 కేసులు నమోదయ్యాయని స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. మొత్తం 14 మందిని అరెస్ట్ చేశామని... 30 సెల్ ఫోన్లు, 3 ల్యాప్ టాప్ లు, కారు, బైకు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

లోన్, ధనీబజార్ పేరుతో రుణాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న మరో ముఠాను కూడా  సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారని స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. ఈ ముఠాలో అభిషేక్ మిశ్రా ప్రధాన నిందితుడని... నకిలీ యాప్ ను తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నాడని తెలిపారు.

More Telugu News