భారత్ 345 ఆలౌట్.. న్యూజిలాండ్ బ్యాటింగ్ మొదలు.. ఓపెనర్ బతికిపోయాడు
- 6 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 8 పరుగులు
- మూడో ఓవర్ లో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న లాథమ్
- ఇషాంత్ ఓవర్ లో ఎల్బీడబ్ల్యూ
- అప్పీల్ తో వేలెత్తేసిన అంపైర్..
- రివ్యూతో బతికిన న్యూజిలాండ్ ఓపెనర్
వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో శ్రేయస్ అయ్యర్ (171 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 105) మాత్రం నిలకడగా ఆడుతూ తన తొలి మ్యాచ్ లోనే శతకాన్ని అందుకున్నాడు. కైల్ జేమీసన్ వేసిన 92వ ఓవర్ లో రెండు పరుగులు తీసి సెంచరీ చేశాడు. అతడు అవుటయ్యాక టెయిలెండర్లతో కలిసి రవిచంద్రన్ అశ్విన్ (56 బంతుల్లో 38) జట్టుకు మంచి స్కోరునందించాడు. చివరి వికెట్ గా ఇషాంత్ శర్మ డకౌట్ అయ్యాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ 5 వికెట్లు పడగొట్టాడు. కైల్ జేమీసన్ 3, ఎజాజ్ పటేల్ 2 వికెట్లు తీశారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన న్యూజిలాండ్ ప్రస్తుతం 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. ఓపెనర్లు విల్ యంగ్ (2), టామ్ లాథమ్ (5) క్రీజులో ఉన్నారు. ఇన్నింగ్స్ మూడో ఓవర్ లో మూడో బంతికి కివీ వికెట్ తీసే చాన్స్ జస్ట్ మిస్ అయింది. ఇషాంత్ వేసిన చక్కటి బంతి టామ్ లాథమ్ ప్యాడ్స్ ను తాకింది. ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ వేలెత్తేశాడు. వెంటనే రివ్యూ కోరిన లాథమ్.. బతికిపోయాడు. బంతి బ్యాట్ ఇన్ సైడ్ ఎడ్జ్ ను తాకినట్టు రిప్లేలో తేలింది. భారత్ చేసిన పరుగులకు మరో 337 పరుగుల దూరంలో న్యూజిలాండ్ ఉంది.