Payyavula Keshav: ఈ రాత్రికి గానీ, రేపు ఉదయానికి గానీ.. రాష్ట్రానికి స్పెషల్ గెస్టులు వస్తున్నారు: పయ్యావుల కేశవ్

  • ఏపీ అప్పులపై గతంలోనే పయ్యావుల వ్యాఖ్యలు
  • తాజాగా మరో ప్రెస్ మీట్
  • ఢిల్లీ నుంచి కేంద్ర సంస్థల అధికారులు వస్తున్నారని వెల్లడి
  • ఏపీ అప్పుల సంగతి బట్టబయలు కానుందని వివరణ
Special Guests are coming to AP says Payyavula

ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందంటూ గతంలో గణాంకాలతో సహా వివరించిన ప్రజాపద్దుల కమిటీ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ నుంచి అప్పులు రాబట్టుకునేందుకు రాష్ట్రానికి ప్రత్యేక అతిథులు వస్తున్నారని వెల్లడించారు. వాస్తవానికి దీనిపై తాను కొంచెం ముందుగానే ప్రెస్ మీట్ పెట్టాలని భావించినా, ఓ విషయం నిర్ధారించుకోవడానికి కొంత సమయం పట్టిందని వివరణ ఇచ్చారు.

ఈ రాత్రికి గానీ, రేపు ఉదయానికి గానీ ఆ అతిథులు విజయవాడ చేరుకోబోతున్నారని చెప్పారు. సాధారణంగా రాష్ట్రాలకు పెట్టుబడిదారులు వస్తుంటారని, కానీ అందుకు భిన్నంగా ఢిల్లీ నుంచి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు, రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ కు చెందిన అధికారులు ఏపీకి వస్తున్నారని, వారు రాష్ట్ర ప్రభుత్వ అప్పులు వసూలు చేసుకునేందుకు వస్తున్నారని పయ్యావుల తెలిపారు.

ఆ అధికారులు రాష్ట్రానికి రాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసిందని వెల్లడించారు. అనేక రకాల ఒత్తిళ్లు తీసుకువచ్చేందుకు యత్నించిందని అన్నారు. అయితే ఆ అప్పులకు తాము జవాబుదారీ అయినందున సదరు ఉన్నతాధికారులు ఒత్తిళ్లకు లొంగక రాష్ట్రానికి రావాలనే నిర్ణయించుకున్నారని వివరించారు.

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ నుంచి తీసుకున్న అప్పులకు సంబంధించి ఏపీ డిస్కంలు, ట్రాన్స్ కో కనీసం నెలవారీ వాయిదాలను కూడా చెల్లించని పరిస్థితి నెలకొని ఉందని, ఈ నేపథ్యంలో అప్పుల వసూళ్లకు ఢిల్లీ నుంచి అధికారులు రాష్ట్రానికి వస్తున్నారని పేర్కొన్నారు.

గతంలో పలు బ్యాంకులు తాము ఇచ్చిన అప్పులను కాపాడుకునేందుకు అదనపు రుణాలు ఇచ్చాయని, ఇప్పుడు పరిస్థితి చేయిదాటిపోయిందని వివరించారు. తాజాగా రాష్ట్రానికి వస్తున్న గెస్టుల కారణంగా ఏపీ అప్పుల విషయం దేశం మొత్తానికి బట్టబయలు కానుందని అన్నారు. ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే విధంగా ప్రయాణిస్తున్నారని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని పయ్యావుల స్పష్టం చేశారు.

More Telugu News