Pakistan: అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న పాకిస్థాన్.. స్కాట్లాండ్‌పై భారీ విజయం

  • సిక్సర్లతో విరుచుకుపడిన షోయబ్ మాలిక్ 
  • అతడికే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు
  • ఆడిన ఐదు మ్యాచుల్లోనూ గెలిచిన పాక్
  • పరాభవంతో టోర్నీ నుంచి నిష్కృమించిన స్కాట్లాండ్
Pakistan crush Scotland in their last league match

టీ20 ప్రపంచకప్‌లో పాక్ విజయాల పరంపర కొనసాగుతోంది. పసికూన స్కాట్లాండ్‌తో గత రాత్రి జరిగిన గ్రూప్ 2 చివరి లీగ్ మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచింది. షోయబ్ మాలిక్ మెరుపు ఇన్నింగ్స్‌కు తోడు కెప్టెన్ బాబర్ ఆజం సమయోచిత ఇన్నింగ్స్‌తో పాకిస్థాన్ తొలుత 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.

అనంతరం 190 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 117 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా పరాజయాలను పరిపూర్ణం చేసుకుని టోర్నీ నుంచి నిష్క్రమించింది. స్కాట్లాండ్ బ్యాటర్లలో ఒక్క రిచీ బెరింగ్టన్ తప్ప మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేకపోయారు.

37 బంతులు ఆడిన బెరింగ్టన్ 4 ఫోర్లు, సిక్సర్‌తో అజేయంగా 54 పరుగులు చేశాడు. ఓపెనర్ మున్సీ 17, మైఖేల్ లీస్క్ 14 పరుగులు చేశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఆది నుంచే దూకుడుగా ఆడింది. స్కాట్లాండ్ బౌలర్లను పాక్ బ్యాటర్లు ఓ ఆటాడుకున్నారు. పరుగుల వరద పారించారు.

బాబర్ ఆజం 47 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులు చేయగా, హఫీజ్ 19 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 31 పరుగులు చేశాడు. చివరి ఓవర్లలో షోయబ్ మాలిక్ శివాలెత్తాడు. సిక్సర్లతో స్కాట్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 18 బంతులు మాత్రమే ఎదుర్కొన్న షోయబ్ ఒక ఫోర్, 6 సిక్సర్లతో 54 పరుగులు (నాటౌట్) చేశాడు. విధ్వంసకర ఆటతీరుతో ఆకట్టుకున్న అతడికే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

ఈ మ్యాచ్‌తో సెమీఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. గ్రూప్ 1లో అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్, గ్రూప్‌ 2లో రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ మధ్య తొలి సెమీస్ జరగనుండగా; గ్రూప్ 2లో మొదటి స్థానంలో ఉన్న పాకిస్థాన్, గ్రూప్ 1లో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మధ్య సెమీఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ నేపథ్యంలో నేటి భారత్-నమీబియా మధ్య జరుగుతున్న గ్రూప్ 2 చివరి మ్యాచ్‌కు ప్రాధాన్యం లేకుండా పోయింది.

More Telugu News