Rajinikanth: ఒకేసారి రెండు.. రేపు తన జీవితంలో ఎంతో స్పెషల్ అంటూ రజనీకాంత్ ప్రకటన

  • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోనున్న తలైవా
  • అవార్డు వస్తుందనుకోలేదన్న రజనీకాంత్
  • దాంతో పాటే తన కూతురు ‘హూట్ యాప్’ ప్రారంభం
Rajini To Be Honored With Dada Saheb Phalke Award Tomorrow

సినీవినీలాకాశంలో ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తలైవా రజనీకాంత్ ను వరించింది. రేపు ఆయన ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఆయన చెన్నైలోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. అనంతరం పత్రికాప్రకటననూ విడుదల చేశారు. అవార్డు రావడం తనకెంతో ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. ఇంత గొప్ప అవార్డు తనకు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. ఇంత మంచి తరుణంలో తన గురువు కె. బాలచందర్ మన మధ్య లేకపోవడం బాధిస్తోందన్నారు.

రేపు తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు అని హర్షం వ్యక్తం చేశారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకుంటున్న రోజే తన కూతురు సౌందర్య ఎంతో ఇష్టపడి సిద్ధం చేసిన ‘హూట్ యాప్’ను విడుదల చేస్తున్నానని వెల్లడించారు. వాస్తవానికి రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గత ఏప్రిల్ లోనే కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. అయితే కరోనా కారణంగా అవార్డుల ప్రదానం వాయిదా పడింది.

More Telugu News