Jagan: గణపతి సచ్చిదానంద ఆశ్రమాన్ని సందర్శించిన జగన్.. సీఎంపై ప్రశంసలు కురిపించిన స్వామీజీ

  • విజయవాడ పటమటలోని ఆశ్రమానికి వెళ్లిన జగన్
  • మరకత రాజరాజేశ్వరీదేవికి ప్రత్యేక పూజలు చేసిన సీఎం
  • హిందూ ధర్మ పరిరక్షణకు జగన్ కట్టుబడి ఉన్నారన్న సచ్చిదానంద
Jagan went to Ganapati Sachidananda Ashram

విజయవాడలోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ సందర్శించారు. పటమటలోని దత్తానగర్ లో ఉన్న ఈ ఆశ్రమానికి వెళ్లిన జగన్... అక్కడున్న మరకత రాజరాజేశ్వరీదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆ తర్వాత దత్త పీఠాధిపతి, అవధూత స్వామి సచ్చిదానందతో ఆయన సమావేశమయ్యారు. స్వామివారి ఆశీస్సులను తీసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ వెంట టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఉన్నారు.

సమావేశానంతరం గణపతి సచ్చిదానంద మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి జగన్ కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అర్చకులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సీఎంను కోరానని తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణకు జగన్ కట్టుబడి ఉన్నారని చెప్పారు. వంశపారంపర్య అర్చకులను కొనసాగించాలని తాను అడిగానని... దానికి ముఖ్యమంత్రి సమ్మతించారని స్వామీజీ తెలిపారు.

More Telugu News