ఢిల్లీ-తిరుపతి మధ్య నాన్‌స్టాప్ విమాన సర్వీసులు ప్రారంభించిన స్పైస్‌జెట్

Spice Jet launched flight between tirupati and delhi
చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ఢిల్లీ-తిరుపతి మధ్య నాన్‌స్టాప్ విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. సహాయ మంత్రులు జనరల్ వీకే సింగ్, ప్రహ్లాద్ పటేల్, స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్‌ జెండా ఊపి నిన్న విమాన సేవలను ప్రారంభించారు.

అనంతరం సింధియా మాట్లాడుతూ.. ఢిల్లీ-తిరుపతి మధ్య ప్రస్తుతం బుధవారం, శుక్రవారం, ఆదివారం సర్వీసులు నడుస్తాయని, ఈ నెల 31 తర్వాత వారంలో నాలుగు రోజులు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మే 2022 నాటికి తిరుపతి రన్‌వే విస్తరణ పనులు పూర్తిచేసి వైట్‌బాడీ అంతర్జాతీయ విమానాలు ల్యాండ్ అయ్యేలా చూస్తామన్నారు.

తిరుపతి విమానాశ్రయం ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ముంబై, హైదరాబాద్, బెంగళూరు, బెళగావి, కలబురిగి, కొల్హాపూర్ నుంచి తిరుపతికి నేరుగా విమానాలు నడుస్తున్నాయి. ఢిల్లీ నుంచి ఇదే తొలిసారి. ఈ రెండు నగరాల మధ్య 2,160 కిలోమీటర్లు కాగా, విమానంలో రెండున్నర గంటల్లో చేరుకోవచ్చు.  రైల్వే రెండో తరగతి ఏసీ చార్జీల కంటే తక్కువ ధరకే విమాన సేవలను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు.
Go Back to Shorts
Spice Jet
Flight
Tirupati
New Delhi

More Telugu News