ott: అంద‌రి వ‌ద్దా మొబైల్ ఫోన్ ఉంది.. వాటిలో కంటెంట్‌ను నియంత్రించాలి: మోహ‌న్ భ‌గ‌వ‌త్‌

  • దేశంలో ఓటీటీ, మొబైల్ కంటెంట్ వంటి వాటితో హాని
  • క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ వంటివాటినీ నియంత్రించాలి
  • దేశ‌ విలువల వ్యవస్థపై పలు రకాలుగా దాడులు
danger from ott

ఓటీటీ, మొబైల్ కంటెంట్‌, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ వంటి విష‌యాల‌పై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ప‌లు సూచ‌న‌లు చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో విజయ దశమి వేడుకల సంద‌ర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ... ఓటీటీలో చూపించే కంటెంట్‌పై నియంత్రణ లేదని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అందులో దేశానికి హాని క‌లిగించే కంటెంట్ ఉండ‌డం స‌రికాద‌ని చెప్పారు.  

అలాగే ఇప్పుడు అంద‌రి వ‌ద్దా మొబైల్ ఫోన్ ఉంటోందని, అందుకని ప్ర‌జ‌లు వాటిల్లో చూసే కంటెంట్‌ను కూడా నియంత్రించాలని ఆయ‌న అన్నారు. క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ వంటివి దేశాల ఆర్థిక వ్యవస్థను అస్థిరపరుస్తాయని ఆయ‌న చెప్పారు. వాటిని ప్రభుత్వం నియంత్రించాలన్నారు.

దేశ‌ విలువల వ్యవస్థపై పలు రకాలుగా దాడులు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. ఇళ్ల‌లో పిల్లలకు నైతిక విలువలు నేర్పాలని చెప్పారు. మరోపక్క, పాకిస్థాన్‌పై మోహ‌న్ భ‌గ‌వత్ మండిప‌డ్డారు. తుపాకుల వాడ‌కంపై శిక్షణ నిచ్చి, ఉగ్రవాదులను పంపి ఆ దేశం ఉగ్ర‌వాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తోంద‌ని తెలిపారు. అలాగే, దేశంలో డ్రగ్స్ వాడకం పెరుగుతోందని ఆయ‌న ఆందోళన వ్యక్తం చేశారు.

More Telugu News