Supreme Court: నీట్ కు లక్షలాది మంది హాజరయ్యారు...లీకైందన్న కారణంతో రద్దు చేయలేం: సుప్రీం కోర్టు

  • నీట్-2021లో అవకతవకలపై పిటిషన్లు
  • పేపర్ లీకైందని, మాల్ ప్రాక్టీసు జరిగిందని ఆరోపణ
  • విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం
  • పిటిషన్ల కొట్టివేత
  • మరోసారి పిటిషన్ వేస్తే జరిమానా తప్పదని హెచ్చరిక
Supreme Court dismiss petitions seeking NEET cancellation

జాతీయస్థాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం ఈ ఏడాది నిర్వహించిన నీట్ పేపర్ లీకైందని, పరీక్ష రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు నేడు విచారణ చేపట్టింది.

నీట్-2021 లీకైందని, మాల్ ప్రాక్టీసు కూడా జరిగిందని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. నీట్ ను రద్దు చేసి, మరోసారి పరీక్ష నిర్వహించాలని, కష్టపడి చదివిన విద్యార్థులకు న్యాయం చేయాలని ఆ పిటిషన్లలో కోరారు. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది.

పేపర్ లీకైందన్న కారణంతో నీట్ రద్దు చేయాలని కోరడం సబబు కాదని, నీట్ కు దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు హాజరైన విషయాన్ని గుర్తించాలని ధర్మాసనం పిటిషనర్లకు హితవు పలికింది. ఆ విద్యార్థుల భవిష్యత్ ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. ఈ క్రమంలో ఆయా పిటిషన్లను కొట్టివేసింది. అంతేకాదు, మరోసారి ఇలాంటి పిటిషన్లతో వస్తే జరిమానా విధించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

More Telugu News