Gold: రూ.100కి కూడా బంగారం కొనచ్చు.. ఆన్ లైన్ కొనుగోళ్లకు ఆఫర్ ప్రకటించిన సంస్థలు

  • తనిష్క్, కల్యాణ్, పీసీ జ్యూలర్స్, సెంకో గోల్డ్ అండ్ డైమండ్స్ లో ఆఫర్
  • కనీసం ఒకగ్రాము అయ్యాక డెలివరీ తీసుకోవచ్చు 
  • ఆన్ లైన్ లో గోల్డ్ సేల్స్ పెరిగాయంటున్న నిపుణులు
Online Gold For Rs 100

కరోనా లాక్ డౌన్ లు లేవు. పైగా పండుగల సీజన్ వచ్చేసింది. ధనత్రయోదశి కూడా మరో నెలలో రాబోతోంది. దీంతో బంగారం అమ్మకాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని సంస్థలు అమ్మకాలను మరింత పెంచుకునేందుకు ఆన్ లైన్ లో రూ.100 విలువ నుంచీ బంగారం అమ్మకం అనే ఆఫర్ ను పెడుతున్నాయి. వాస్తవానికి లాక్ డౌన్ తో షాపులన్నీ మూతపడడంతో ఓ రకంగా ఆన్ లైన్ లో గోల్డ్ కొనే వినియోగదారులు పెరిగారు.

ఈ క్రమంలోనే టాటా గ్రూప్ కు చెందిన తనిష్క్, కల్యాణ్ జ్యూయలర్స్ ఇండియా లిమిటెడ్, పీసీ జ్యూయలర్స్, సెంకో గోల్డ్ అండ్ డైమండ్స్ వంటి సంస్థలు ఆన్ లైన్ లో ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఆయా సంస్థల వెబ్ సైట్ల ద్వారా కానీ, ఆ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్న ఇతర డిజిటల్ ప్లాట్ ఫామ్ ల నుంచి కానీ రూ.100ల నుంచి బంగారం కొనచ్చు. అలా కస్టమర్లు కనీసం ఒక గ్రాముకు సరిపడా బంగారం కొన్న తర్వాత దానిని డెలివరీ తీసుకోవచ్చు.

వాస్తవానికి ఆగ్మోంట్ గోల్డ్ ఫర్ ఆల్, సేఫ్ గోల్డ్ వంటి సంస్థలు ఇప్పటికే ఆన్ లైన్ లో విక్రయిస్తున్నా.. మన దేశంలో మాత్రం కరోనా లాక్ డౌన్ తోనే ఆన్ లైన్ గోల్డ్ కు ఆదరణ పెరిగిందని ఆగ్మోంట్ గోల్డ్ డైరెక్టర్ కేతన్ కొఠారి చెప్పారు. గత ఏడాది ఫిబ్రవరి నుంచి తమ ప్లాట్ ఫాంలో కొనుగోళ్లు 200 శాతం పెరిగాయన్నారు. ఎక్కువగా 3 వేల నుంచి రూ.4 వేల మధ్య ఉన్న గోల్డ్ కాయిన్లను కొనుగోలు చేశారన్నారు. పండుగ సీజన్లలో ఆన్ లైన్ లో మరో 30 శాతం పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

More Telugu News