IPL: తాలిబన్ల షాకింగ్ నిర్ణయం.. దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం!

  • ఐపీఎల్ ను ప్రసారం చేయవద్దని మీడియాకు తాలిబన్ల ఆదేశాలు
  • మ్యాచ్ లు జరిగే స్టేడియంలలో మహిళలు ఉంటారని వ్యాఖ్య
  • చీర్ లీడర్లు డ్యాన్స్ చేస్తారని అభ్యంతరం
Talibans ban IPL in Afghanistan

బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రపంచంలో లో జరిగే టీ20 టోర్నీల్లో ఐపీఎల్ కే అత్యధిక క్రేజ్ ఉంటుంది. ఈ టోర్నీలో ఆడేందుకు అన్ని దేశాలకు చెందిన స్టార్ క్రికెటర్లందరూ ఉవ్విళ్లూరుతుంటారు. అయితే, ఐపీఎల్ ను తమ దేశంలో ప్రసారం చేయవద్దంటూ ఆప్ఘనిస్థాన్ పాలన చేపట్టిన తాలిబన్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మీడియా సంస్థలను ఆదేశించారు.

అయితే, ఈ నిర్ణయం తీసుకోవడానికి వారు చెప్పిన కారణం మరీ విడ్డూరంగా ఉండటం గమనార్హం. ఐపీఎల్ జరిగే స్టేడియంలో మహిళా ప్రేక్షకులు ఉంటారని, మ్యాచ్ ల సందర్భంగా యువతులు (చీర్ లీడర్లు) డ్యాన్స్ చేస్తారని... అందుకే ఐపీఎల్ ప్రసారాలను బ్యాన్ చేస్తున్నట్టు తెలిపారు.

ఆఫ్ఘనిస్థాన్ ను చేజిక్కించుకున్నప్పటి నుంచి మహిళలపై తాలిబన్లు ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తున్నారు. మహిళల గౌరవాన్ని కాపాడతామని తాలిబన్లు ప్రకటించినప్పటికీ... ఆ మేరకు వారు ఏ మాత్రం వ్యవహరించడం లేదు. అన్ని రకాల క్రీడలకు మహిళలను దూరం చేశారు. ఇంటికే పరిమితం కావాలని, పురుషుల తోడు లేకుండా ఇంటి గడప కూడా దాటరాదని హుకుం జారీ చేశారు. 

More Telugu News