GST Council: ముగిసిన జీఎస్టీ మండలి సమావేశం... కీలక నిర్ణయాలు ఇవిగో!

  • లక్నోలో 45వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ
  • 20 నెలల తర్వాత ప్రత్యక్ష పద్ధతిలో సమావేశం
  • పలు నిర్ణయాలకు జీఎస్టీ మండలి ఆమోదం
  • పెట్రో ఉత్పత్తులపై కుదరని ఏకాభిప్రాయం
  • ఇది తగిన సమయం కాదన్న నిర్మలా సీతారామన్
GST Council meet concludes

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన లక్నోలో నిర్వహించిన 45వ జీఎస్టీ మండలి సమావేశం ముగిసింది. దాదాపు 20 నెలల తర్వాత ప్రత్యక్ష పద్ధతిలో ఈ సమావేశం చేపట్టారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మండలి ఆమోదం తెలిపింది. కండరాల క్షీణత ఔషధాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పించారు. రూ.16 కోట్ల విలువైన ఔషధాలకు మినహాయింపు వర్తించనుంది. కేంద్రం సూచించిన ఔషధాల దిగుమతిపై ఐసీఎస్టీ మినహాయింపు ఇచ్చారు.

కరోనా సంబంధిత ఔషధాల ధరలపై జీఎస్టీ రాయితీలను డిసెంబరు 31 వరకు పొడిగించారు. క్యాన్సర్ ఔషధాలపై 12 శాతం నుంచి 5 శాతానికి జీఎస్టీ కుదించారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు సరఫరా చేసే బయోడీజిల్ పై జీఎస్టీ తగ్గించారు. బయోడీజిల్ పై 12 నుంచి 5 శాతానికి జీఎస్టీ తగ్గిస్తున్నట్టు కౌన్సిల్ పేర్కొంది. నేషనల్ పర్మిట్ కోసం రవాణా వాహనాలపై రాష్ట్రాలు విధించే పన్నులో మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు.

కాగా, పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశంపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, జీఎస్టీలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకువచ్చేందుకు ఇది తగిన సమయం కాదని అన్నారు.

More Telugu News