CBI: సీబీఐ అదుపులో వైసీపీ సోషల్ మీడియా కంటెంట్ రైటర్‌?

  • ఏపీ హైకోర్టుపైనా, న్యాయమూర్తులపైనా అనుచిత వ్యాఖ్యలు
  • ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ
  • తాజాగా, అవుతు శ్రీధర్‌రెడ్డి అరెస్ట్
  • నేడు అధికారికంగా ప్రకటించే అవకాశం
Another Arrest in indecent remarks against AP High Court

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసులో సీబీఐ తాజాగా మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. తీర్పులకు పార్టీల రంగు పులిమి న్యాయమూర్తులపైన, కోర్టులపైనా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు నమోదైన కేసును విచారిస్తున్న సీబీఐ ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. ఇదే కేసులో సీబీఐ గత నెలలో పట్టపు ఆదర్శ్, లావనూరు సాంబశివారెడ్డిలను అరెస్ట్ చేసింది. తాజాగా, వైసీపీ సోషల్ మీడియా విభాగంలో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్న అవుతు శ్రీధర్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

అయితే, ఈ విషయమై పెదవి విప్పని సీబీఐ అధికారులు.. శ్రీధర్‌రెడ్డి అరెస్ట్‌పై నేడు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. మొత్తం 16 మంది నిందితులకు వ్యతిరేకంగా గతేడాది 11న కేసులు నమోదయ్యాయి. వీరిలో 13 మందిని డిజిటల్ వేదికల ద్వారా గుర్తించిన సీబీఐ.. వారిలో ముగ్గురు విదేశాల్లో ఉన్నట్టు తేల్చింది. వారిని భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. నిందితుల్లో ఒకరు నకిలీ పాస్‌పోర్టును ఉపయోగిస్తున్నట్టు కూడా గుర్తించింది.

More Telugu News