Chiranjeevi: మ‌ట్టితో చేసిన గ‌ణేశుడికి భార్య‌తో క‌లిసి చిరంజీవి పూజ‌లు.. 'వినాయ‌క క‌థ' వినిపించిన మోహ‌న్ బాబు!

  • ఇళ్ల‌లో సినీ ప్ర‌ముఖుల గణేశ్ పూజ‌లు
  • ఫొటోలు షేర్ చేసిన టాలీవుడ్ న‌టులు
  • చ‌వితి శుభాకాంక్ష‌లు చెప్పిన ఎన్టీఆర్, నాని  
chiru performs pooja

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పలువురు సినీ ప్ర‌ముఖులు పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి త‌న ఇంట్లో మ‌ట్టితో చేసిన వినాయ‌కుడికి భార్య‌తో క‌లిసి పూజ‌లు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు.
               
'అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో.. జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు, ఆటంకాలు తొలగి అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో అభివృద్ధి పథంలో సాగాలని కోరుకొంటున్నాను' అని చిరంజీవి పేర్కొన్నారు.

మ‌రోవైపు, సినీన‌టుడు మోహ‌న్ బాబు విఘ్నేశ్వ‌రుడి పూర్తి క‌థ‌ను చెప్పారు. ఈ క‌థ చెప్పాల‌ని త‌న కుమారుడు మంచు విష్ణు కోరడంతో ఈ క‌థ చెబుతూ ఈ ఆడియో రికార్డు చేశాన‌ని మోహ‌న్ బాబు అన్నారు. ఈ ఆడియోను మోహ‌న్ బాబు త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

కాగా, 'మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు' అంటూ సినీన‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.

            
త‌న కుమారుడితో క‌లిసి సినీ హీరో నాని ఇంట్లో పూజ‌లు చేశాడు. 'అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పూజ అయ్యాక మీ కుటుంబంతో కలిసి సినిమా చూడండి. మీకు నచ్చుతుంది. అమ్మా నాన్నకి ఇంకా ఎక్కువ నచ్చుతుంది' అని నాని ట్వీట్ చేశాడు.

శివ నిర్వాణ ద‌ర్శ‌కత్వంలో వ‌చ్చిన‌ 'టక్‌ జగదీష్' సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో విడుద‌లైంది. నాని, రీతూవర్మ, ఐశ్వర్య రాజేశ్‌, జగపతిబాబు, డానియల్‌ బాలాజీ, నరేశ్‌, రావు రమేశ్ త‌దితరులు ఇందులో న‌టించారు.

More Telugu News