Team India: ఫిజియో యోగేశ్ పర్మార్‌కు కరోనా.. ఐదో టెస్టు జరిగేనా?

  • జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్‌కు పాజిటివ్
  • ఐదో టెస్టుపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ సందేహం
  • ఇప్పటికే కోచ్ రవిశాస్త్రి సహా మరో ఇద్దరికి కరోనా
another corona positive in Indian camp what is the future of 5th test

రసవత్తరంగా సాగుతున్న భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. కరోనా కారణంగా ఈ సిరీస్ చివరి టెస్టు జరుగుతుందా? లేదా? అనే సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే భారత జట్టు కోచ్ రవిశాస్త్రి, సీనియర్ ఫిజియో నితిన్ పటేల్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్‌కు కరోనా రావడంతో భారత శిబిరంలో అలజడి రేగింది.

ఇప్పుడు తాజాగా జట్టు జూనియర్ ఫిజియోగా ఉన్న యోగేశ్ పర్మార్‌కు కూడా కరోనా సోకినట్లు వెల్లడైంది. దీంతో ఆఖరి టెస్టు మ్యాచ్ జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై స్వయంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీనే సందేహం వ్యక్తం చేయడం అభిమానులను మరింత కలవరపెడుతోంది.

యోగేశ్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో జట్టు మొత్తానికి మరోసారి కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ ఫలితాలు రాత్రికి వస్తాయని, వాటిని బట్టి మ్యాచ్ జరిగేదీ లేనిదీ తెలుస్తుందని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకూ ఆటగాళ్లను వారికి కేటాయించిన గదుల్లోనే ఉండాలని, బయటకు రావొద్దని సూచించారు.

భారత జట్టు కోచ్ రవిశాస్త్రి రాసిన ‘స్టార్‌గేజింగ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమం కొన్నిరోజుల క్రితం జరిగింది. ఆ కార్యక్రమం తర్వాత రవిశాస్త్రి సహా నితిన్ పటేల్, శ్రీధర్‌లకు కరోనా సోకింది. ఇప్పుడు యోగేశ్ కూడా కరోనా బారిన పడటం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. కాగా, ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో భారత జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. చివరిదైన ఐదో టెస్టు శుక్రవారం ప్రారంభం కావలసి ఉంది.

More Telugu News