Guntur District: గుంటూరు జిల్లాలో దారుణం: దంపతులను అడ్డగించి వివాహితపై సామూహిక అత్యాచారం

  • వివాహానికి వెళ్లి బైక్‌పై వస్తున్న దంపతుల అడ్డగింత
  • భర్తపై దాడిచేసి వివాహితపై అత్యాచారానికి తెగబడిన దుండగులు
  • ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించిన పోలీసులు
Gang Rape in guntur dist sattenapalle

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలో దారుణం జరిగింది. గుంటూరులో జరిగిన ఓ వివాహానికి హాజరైన సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు గత రాత్రి బైక్‌పై తిరిగి బయలుదేరారు. ఈ క్రమంలో మేడికొండూరు అడ్డరోడ్డు సమీపంలో వారిని అడ్డగించిన దుండగులు మహిళ భర్తపై దాడిచేశారు. అనంతరం వివాహితను పొలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి దాటాక బాధితులు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు.

అయితే, ఈ ఘటన జరిగిన ప్రదేశం గుంటూరు అర్బన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఫిర్యాదు తీసుకోబోమని పోలీసులు తేల్చి చెప్పినట్టు బాధితులు వాపోయారు. పోలీసుల తీరుతో బాధితులు నిరాశగా వెనుదిరిగారు. నిజానికి ఘటన ఎక్కడ జరిగినా తొలుత జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

More Telugu News