Vishnu Vardhan Reddy: మల్లాది విష్ణు యావత్ హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

  • ఏపీలో వినాయక చవితి రగడ
  • ఆంక్షలు విధించిన ప్రభుత్వం
  • తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీ
  • వైసీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం
BJP leader Vishnuvardhan Reddy demands Malladi Vishnu for public apology

వినాయక చవితి నేపథ్యంలో వైసీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి తాజాగా వైసీపీ నేత, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణుపై మండిపడ్డారు.

గణేశ్ ఉత్సవ నిర్వహణపై చిత్తూరు జిల్లా ఐరాల ఎస్సై విడుదల చేసిన నోటీసులను నిన్న తాను ఓ టీవీ చానల్ డిబేట్ లో ప్రదర్శిస్తే, మల్లాది విష్ణు తమపై తీవ్ర విమర్శలు చేశారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఆ నోటీసులను బీజేపీ నేతలు ఎక్కడో తయారు చేసుకుని తీసుకువచ్చి తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మల్లాది విష్ణు కొట్టిపారేశారని వివరించారు. తమ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని బెదిరించారని ఆరోపించారు.

"కానీ, ఇవాళ అదే ఐరాల ఎస్సైని గణేశ్ ఉత్సవాల నిబంధనల పత్రం విడుదల చేశాడన్న కారణంగా సస్పెండ్ చేసినట్టు చిత్తూరు జిల్లా పోలీసులు వెల్లడించారు. మల్లాది విష్ణు దీనికేం సమాధానం చెబుతారు? మేం చూపించిన వాస్తవాలను తప్పు అని చెబుతూ, మాపై బెదిరింపులకు పాల్పడిన మల్లాది విష్ణు యావత్ హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. లేదంటే మీరు హిందూ వ్యతిరేకులన్న విషయం స్పష్టమైంది కాబట్టి సరైన సమయంలో ప్రజలే మీకు బుద్ధి చెబుతారు" అని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.

More Telugu News