jacqueline fernandez: మనీలాండరింగ్ కేటుగాడి చేతిలో మోసపోయిన బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్!

  • కాలర్ ఐడీ స్పూఫింగ్ ద్వారా హీరోయిన్‌తో పరిచయం
  • పెద్ద పలుకుబడి ఉన్న వాడిగా నాటకం
  • జైల్లో నుంచే పెద్ద రాకెట్ నడిపిన సుకేష్
  • 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణ
sukesh chandrasekhar used to spoof call bollywood actress jacqueline fernandez

మనీలాండరింగ్ కేసులో ఇటీవల ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ముందు విచారణకు హాజరైన శ్రీలంక బ్యూటీ, బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఈ కేసుతో సంబంధం లేదని తేలింది. సుకేష్ చంద్రశేఖర్ అనే మోసగాడికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమెను సాక్షిగా పరిగణించిన ఈడీ విచారణ జరిపింది.

ఈ క్రమంలో తీహార్‌ జైల్లో ఉన్న సుకేష్.. కాలర్ ఐడీ స్పూఫింగ్ ద్వారా జాక్వెలిన్‌ను సంప్రదించినట్లు తెలిసింది. తనను తాను బాగా పలుకుబడి ఉన్న వ్యక్తిగా పరిచయం చేసుకుని జాక్వెలిన్‌తో మాట్లాడేవాడని ఈడీ వెల్లడించింది. జాక్వెలిన్‌తోపాటు మరో ప్రముఖ మహిళా సెలెబ్రిటీని సుకేష్ టార్గెట్ చేసినట్లు అధికారులు చెప్పారు.

గతవారమే చెన్నైలో సుకేష్‌కు చెందిన ఒక బంగళాను  ఈడీ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ వారికి డజనుకు పైగా ఖరీదైన కార్లు, కొంత డబ్బు కూడా దొరికాయి. ఒక బిజినెస్‌మ్యాన్‌ను మోసం చేసిన సుకేష్.. అతని వద్ద నుంచి ఏడాది కాలంలో రూ.200 కోట్లపైగా దోచుకున్నట్లు కేసు నమోదైంది. అతనిపై 20కిపైగా వేరే దోపిడీ కేసులు కూడా ఉన్నాయి.

ఇదంతా ఒక ఎత్తయితే.. తీహార్ జైల్లో ఉన్న సుకేష్.. అక్కడి నుంచి ఇంత పెద్ద రాకెట్ నిర్వహించి, సెలెబ్రిటీలను కూడా మోసం చేయడం చూసిన ఈడీ అధికారులు అవాక్కవుతున్నారు. ఇదిలావుండగా, ప్రస్తుతం ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) అదుపులో ఉన్న సుకేష్‌ రిమాండ్‌ను తాజాగా మరో నాలుగు రోజులు పొడిగించారు.

More Telugu News