Police: వ్యక్తిగత కారణాలతోనే ఎస్సై భవాని ఆత్మహత్య.. ఈ రోజు చనిపోతున్నానంటూ నోట్!

  • శిక్షణ కోసం విజయనగరం వచ్చిన భవాని
  • పీటీసీ క్వార్టర్స్‌లో మూడు రోజుల క్రితం ఆత్మహత్య
  • ‘నేను ఈ రోజు చనిపోతున్నా’నన్న నోట్ తప్ప లభించని ఆధారాలు
personal reasons behind SI Bhavani suicide

సఖినేటిపల్లి ఎస్సై కె.భవాని (25) వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడిందని, తాను ఈ రోజు చనిపోతున్నానంటూ ఆమె రాసిన సూసైడ్ నోట్ లభ్యమైందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న భవాని శిక్షణ నిమిత్తం ఐదు రోజుల క్రితం విజయనగరం వచ్చారు. శనివారం మధ్యాహ్నం శిక్షణ పూర్తికాగా, ఆదివారం తిరిగి ఆమె సఖినేటిపల్లికి వెళ్లాల్సి ఉంది. అయితే, పోలీస్ శిక్షణ కళాశాల (పీటీసీ) క్వార్టర్స్‌లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె మృతికి కారణాలను శోధించారు. తాజాగా, ఆమె బస చేసిన గదిలోని ఓ పుస్తకంలో భవాని రాసినట్టుగా చెబుతున్న ‘ఈ రోజు చనిపోతున్నా’ అని ఉన్న నోట్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇంతకుమించి ఎలాంటి ఆధారాలు లభించలేదని, వ్యక్తిగత కారణాలతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

More Telugu News